Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో నిందితుడు
- న్యాయం చేయాలని తల్లిదండ్రుల ఫిర్యాదు
- గతంలో వారిద్దరూ పెండ్లి చేసుకున్నారన్న అనుమానాలు..!
నవతెలంగాణ- గజ్వేల్/ వేములవాడ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసిన వ్యక్తి ప్రేమికుడేనని పోలీసుల విచారణలో తేలింది. బుధవారం సాయంత్రం నిందితుడు వెంకటేశ్ను వేములవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకు ముందు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య(25) గజ్వేల్ మంజీర గ్రామీణ మొదటి శాఖ బ్యాంకులో పనిచేసేది. దివ్య వేములవాడలోని పాఠశాలలో చదువుతున్నప్పుడే వెంకటేశ్ వెంబడించాడు. ఆ తరువాత ఆమె హైదరాబాద్లో చదువుతున్నప్పుడు కూడా ప్రేమ పేరుతో వేధించడంతో పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆరు నెలల కిందట ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లోనూ దివ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మళ్లీ దివ్య జోలికి రావొద్దంటూ వెంకటేశ్, అతని తల్లిదండ్రులతో రాతపూర్వకంగా రాయించారు. అనంతరం దివ్యకు బ్యాంకులో ఉద్యోగం రావడంతోపాటు ఇటీవల మరో బ్యాంకు ఉద్యోగితో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 26న జరగాల్సిన పెండ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు వెంకటేశ్ మంగళవారం సాయంత్రం గజ్వేల్ పట్టణానికి చేరుకుని దివ్య పనిచేస్తున్న బ్యాంకు సమీపంలో కపలా కాశాడు. బ్యాంకు నుంచి ఆమె సాయంత్రం లక్ష్మిప్రసన్ననగర్లో ఇంటికి చేరుకుంది. దివ్య రాత్రి 8 గంటల సమయంలో డాబా మీద ఆరేసిన బట్టలను తీసుకొని కిందకు వస్తుండగా వెంకటేశ్ అడ్డుపడి గొంతు కోసి పరారయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో గజ్వేల్ పోలీసులు బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చేరుకుని నిందితుని తల్లిదండ్రులు పర్శరాములు, మల్లేశ్వరీలను విచారించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్గౌడ్ స్థానిక స్టేషన్లో లొంగిపోయాడు. అక్కడి నుంచి పోలీసులు గజ్వేల్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. అయితే, గతంలో వెంకటేశ్గౌడ్, దివ్య ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకున్నారని వేములవాడ స్థానికులు చెబుతున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లారని, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే పెండ్లి చేసుకుంటుందన్న కోపంతోనే వెంకటేశ్ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
దివ్య మృతదేహానికి పోస్టుమార్టం..
సిద్దిపేట జిల్లా ఇన్చార్జి సీపీ శ్వేత నేతృత్వంలో దివ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు మణెమ్మ, లక్ష్మీరాజ్యం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ''కొంతకాలంగా వేధిస్తున్న వెంకటేశ్.. మా బిడ్డకు నిశ్చితార్థం అయిన విషయం తెలుసుకుని నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దని పొట్టన పెట్టుకున్నాడు'' అని బోరున విలపించారు.
నిందితున్ని కఠినంగా శిక్షించాలి
సీపీఐ(ఎం) నాయకులు ఎల్లయ్య
బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని వాపో యారు. కఠిన చట్టాలున్నా అమలులో జాప్యం జరుగుతోందన్నారు.