Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో లక్ష్మణ్, సంజయ్
- మహిళా కోటాలో డీకే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై రచ్చ జరుగుతున్నది. పలువురు ప్రధాన నాయకులు పదవి కోసం పోటీపడుతున్నారు. అధిష్టానం ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నారు. రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ రెండు పేర్లనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత అధ్యక్షులు లక్ష్మణ్ కోసం బండి సంజరు, ధర్మపురి అరవింద్ కాస్త వెనక్కి తగ్గినా అధిష్టానం మాత్రం ఆయన వైపు చూడట్లేదని వినికిడి. రాష్ట్ర ప్రభుత్వంపై మీడియా ద్వారా ఇటీవల రాజకీయ దాడి పెంచినా మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడం ఆయన బలహీనతగా మారిందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. టీఆర్ఎస్కు మొదటి నుంచి ఆయువుపట్టుగా ఉంటూ వస్తున్న కరీంనగర్ గడ్డ నుంచి గెలుపొందిన బండి సంజరు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడగొట్టిన ధర్మపురి అరవింద్లో ఒకరిని నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నది. అయితే, లక్ష్మణ్, సంజరు, అరవింద్ ఒకే బీసీ సామాజిక తరగతికి చెందిన వారు కావటం గమనార్హం. మరోవైపు తెలంగాణలో బాగా ప్రాబల్యం సామాజిక తరగతి నేతలు తమ వంతుగా కేంద్ర నాయకత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ కోసం సంజరు, అరవింద్ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. హౌం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్రెడ్డి ఉండటంతో ఆ సామాజిక తరగతికి చెందిన వ్యక్తులను బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోవట్లేదని ప్రచారం జరుగుతున్నది. మహిళా కోటాలో డీకే అరుణ గట్టి పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో ఆమెకు బలమైన ఆశీస్సులు లేకపోవడం బలహీనతగా ఉంది. తొలుత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పేర్లు వినిపించినా వారిద్దరూ సీఎం కేసీఆర్ సామాజిక తరగతికి చెందిన వారే కావడం, ఇప్పటికే వారు జాతీయ స్థాయిలో పదవులు అనుభవిస్తుండటంతో పక్కనబెట్టారు.
బీసీ సామాజిక తరగతికి చెందిన బలమైన నేతకు అధ్యక్ష పదవి కట్టబెట్టి దూకుడు పెంచాలని బీజేపీ ఎత్తుగడ. కరీంనగర్లో దూకుడుగా ముందుకు వెళ్తూ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఎంపీ బండి సంజరుని అధ్యక్షునిగా నియమించి కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ ఆలోచన. అయితే, లక్ష్మణ్ కోసం ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ బండి సంజరు వైపే అమిత్షా మొగ్గుచూపుతున్నట్టు ఆ పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరి అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారు ఒకింత నిరాశతో, అసహనంతో ఉన్నట్టు వినికిడి. నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆలోచనతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.