Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సన్ రైజ్' ఆస్పత్రిలో ఘటన
- చనిపోయినా చెప్పలేదని తల్లిదండ్రుల ఆరోపణ
- ఆస్పత్రి ఎదుట ఆందోళన
నవతెలంగాణ- నారాయణగూడ
బాలుడు చనిపోయినా.. చెప్పకుండా వైద్యం పేరుతో రూ.రెండు లక్షలకుపైగా వసూలు చేశారు ప్రయివేలు ఆస్పత్రి వైద్యులు. ఈ ఘటన హైదరాబాద్ నారాయణగూడలోని 'సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పటల్'లో బుధవారం వెలుగు చూసింది. బాధిత తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట్ బతుకమ్మ కుంటకు చెందిన నరసింహనాయక్ కుమారుడు కార్తిక్నాయక్(6నెలలు) ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుండటంతో ఈ నెల 15న 'సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పటల్'లో చేర్పించారు. అప్పటి నుంచి బాలున్ని తల్లిదండ్రులకు చూపించలేదు. వివిధ వైద్య పరీక్షల పేరుతో రూ.రెండు లక్షల వరకు వసులు చేశారు. బుధవారం తమ కుమారున్ని చూపించాలని తల్లిదండ్రులు ప్రశ్నించగా, మిగిలిన రూ.16,500 కట్టండి.. చూపిస్తామన్నారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో చివరకు చనిపోయిన బాలుడి మృతదేహాన్ని చూపించారు. చనిపోయిన విషయం తమకు చెప్పకుండా డబ్బుల కోసం వైద్యం చేస్తున్నట్టు నటించారని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆస్పత్రి యాజమాన్యానికే మద్దతుగా ఉండి, తమను భయభ్రాంతులకు గురి చేశారని బాధితులు ఆరోపించారు. ఆస్పత్రిలో అనుభవమున్న వైద్యుల్లేకపోవడంతో బీహెచ్ఎంఎస్ వైద్యులతో వైద్యం అందిస్తున్నారన్నారు.