Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో పలువురు వ్యక్తలు
నవతెలంగాణ - వైరా
నాలుగు దశాబ్దాలపాటు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకుని పీడిత ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి వేదగిరి శ్రీనివాసరావు అని పలువురు వక్తలు అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) వైరా కార్యాలయం బోడేపూడి భవన్ ఆవరణలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం వేదగిరి సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. వేదగిరి నిబద్ధతతో పనిచేశారని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారని గుర్తు చేశారు.
పల్లె ప్రజలతో మమేకం కావాలని, అందుకు పల్లెల్లో నిద్రించాలని పార్టీ పిలుపిస్తే అత్యధిక గ్రామాల్లో పల్లె నిద్రలు చేసిన నలుగురు వ్యక్తుల్లో వేదగిరి ఒకరని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ జిల్లా నాయకులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి అనేక పదవులు అనుభవించి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే అధికారపార్టీలో చేరి అవకాశాల కోసం అర్రులు చాస్తున్న రోజుల్లో చివరి వరకు కమ్యూనిస్టుగా ఉన్న వేదగిరి ధన్యజీవి అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య మాట్లాడుతూ.. వైరా ప్రాంతంలో అనేక సమస్యలను తట్టుకుని పార్టీ అభివృద్ధికి శ్రీనివాసరావు కృషి చేశారన్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. వేదగిరితో 30ఏండ్లు కలిసి పనిచేశానన్నారు. ఎంపీపీగా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చాడన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బండారు రవికుమార్, ఎం.సుబ్బారావు, కాసాని అయిలయ్య తదితరులు ప్రసంగించారు.