Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనీ, మౌలిక వసతులు కల్పించాలనీ కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పేరుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గత కొంతకాలంగా వారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. దీంతో హాస్టల్ నిర్వహణకూ నిధుల్లేక సరైన సదుపాయం కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ప్రతి రోజూ వారికి ఇవ్వాల్సిన స్నాక్స్ కూడా అందించడం లేదని తెలిపారు. అనేక హాస్టళ్లలో చిన్నచిన్న మరమ్మతులు సైతం చేయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన దృష్టి వసతిగృహాలపై పెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం హాస్టళ్ల కోసం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేండ్ల కాలంలో హాస్టళ్లను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించిందని, ఈ కాలంలో వసతి గృహాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయని తెలిపారు. స్నానం చేయడానికి నీళ్లు లేక, తాగడానికీ మంచి నీళ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రానున్న బడ్జెట్లో అధిక నిధులు సంక్షేమ రంగానికి కేటాయించి హాస్టళ్లను బాగుచేయాలన్నారు.నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.