Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని పటిష్టపరచాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను వదిలించుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పగిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. దీనిఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజానీకం వారి ఆదాయంలో అత్యధిక భాగాన్ని కార్పొరేట్ ఆస్పత్రులకే దారపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించి ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని పటిష్టపరచాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కార్పొరేట్ శక్తులకు వదిలేస్తున్నందున పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని విమర్శించారు. అనారోగ్యంతో ఒక్కసారి ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరితే రోగులు దాచుకున్న పొదుపుతోపాటు, అప్పులపాలవుతున్నారని తెలిపారు. మందులకయ్యే ఖర్చు కన్నా వాటి హంగూ, ఆర్భాటాలకే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కాలంలో కార్పొరేట్ ఆస్పత్రులను కొన్ని విదేశీ సంస్థలు కొనేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న వాటిలో సుమారు 50 శాతం కార్పొరేట్ ఆస్పత్రులు విదేశీ సంస్థల చేతుల్లోకి మారాయంటే వారిష్టమొచ్చినట్టు దోచుకోవడానికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు. అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితర వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రోగ నిర్దారణ పరీక్షలకు అవసరమైన పరికరాల్లేవని గుర్తు చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకున్న పరికరాలూ చిన్నపాటి మరమ్మతు వచ్చినా బాగుచేయకుండా మూలనపడేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి కేసీఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టినా అదే పద్ధతిలో వాటిలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్యంపై బడ్జెట్లో ఇప్పుడు కేటాయిస్తున్న దానికంటే ఐదురెట్లు పెంచాలన్నారు. కేటాయించిన నిధులు అవినీతిమయం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులు బలపడేలా కృషి చేయాలని కోరారు. ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడంతోపాటు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను పటిష్టపరచాలనీ, కార్పొరేట్, ప్రయివేటు వైద్య దోపిడీని అడ్డుకునేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును తీసుకురావాలని సూచించారు.