Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్అలీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేపట్టినా ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఏఏ చట్టాన్ని తమ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తున్నదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసు శాఖలో జరుగుతున్న బదిలీలలో అవినీతి చోటు చేసుకుంటున్నదంటూ ఒక పత్రికలో వచ్చిన వార్త సత్యదూరమైందని ఆయన ఖండించారు. పోలీసు శాఖ విధులలో తమ మంత్రులు కాని, ప్రజాప్రతినిధులు కాని ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఇలాంటి వార్త రాసిన పత్రికపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నయీమ్ కేసులో కొందరు అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణ సాగుతున్నదని, విచారణలో తేలిన అంశాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. హుస్నాబాద్ పోలీసుస్టేషన్ నుంచి ఎకె 47, కార్బయిన్ వంటి ఆయుధాల చోరీ జరగడంపైనా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా దర్యాప్తు జరుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని సీఎం కేసీఆర్ ధృఢవిశ్వాసమని, ఆ దిశగానే పోలీసుశాఖకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలను, బడ్జెట్ను ప్రభుత్వం కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు.
పోలీసు ఉన్నతాధికారుల హల్చల్
పోలీసు శాఖలో బదిలీలు, పోస్టింగ్ లలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందంటూ ఒకపత్రికలో వచ్చిన వార్తకు సీనియర్ ఐపీఎస్ అధికారులు వివరణ ఇవ్వడానికి పోటీ పడ్డారు. వరుస బెట్టి ఒకరి తర్వాత మరొకరు ప్రెన్ఫరెన్స్లు పెట్టి శనివారం హల్ చేశారు. డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్, ఐజీ ప్రమోద్కుమార్, డీఐజీ శివశంకర్రెడ్డిలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడగా, మరో వైపు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, వరంగల్ కమిషనర్ రవీందర్ పత్రికలో వచ్చిన వార్తను ఖండించారు. ఇంత పెద్ద శాఖలో కొందరు తప్పడు వ్యక్తులు లేకపోలేదని అంత మాత్రాన పూర్తిగా పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వార్త రాయడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.