Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
- బైకుల నుంచి కిందపడి ముగ్గురు మహిళలు..
- గొర్ల మందపైకి లారీ దూసుకొచ్చి కాపరి..
నవతెలంగాణ-గంగాధర/నాగార్జునసాగర్/గజ్వేల్/జోగిపేట
బైకులపై వెళ్తుండగా వాహనాలు అదుపుతప్పి ముగ్గురు మహిళలు మరణించగా.. గొర్ల మందపైకి లారీ దూసుకురావడంతో కొన్ని మూగజీవాలు సహా కాపరి మృతిచెందాడు. ఏడుపాయల ఆలయానికి వెళ్తూ బైకు అదుపుతప్పి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్, నాగర్కర్నూల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాలకు చెందిన నిట్టు కొమురయ్య, కనకమ్మ (35) గంగాధర సంతకు బైకుపై వెళ్తున్నారు. కురిక్యాల వద్ద కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన హర్యానా లారీ ఢీ కొటింది. కనకమ్మ లారీ కింద నుజ్జునుజ్జయ్యింది. గాయాలైన భర్తను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లెకు చెందిన గొర్ల కాపరి జక్కల లింగయ్య పైలాన్కాలనీ మూల మలుపు వద్ద గొర్లను మేపుతున్నాడు. ఓ లారీ అతి వేగంగా దూసుకురావడంతో లింగయ్య అక్కడికక్కడే మరణించాడు. ఎనిమిది గొర్లు మత్యువాత పడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు విజయపూర్ టౌన్ ఎస్సై శ్రీనయ్య తెలిపారు. హైదరాబాద్ నగరంలోని అఫిస్పేట్ డివిజన్ వైశాలినగర్కు చెందిన విజయకాంత జైన్ (40) కొడుకు స్నేహితుడి బైకుపై వెళ్తుండగా వాటర్ ట్యాంక్ ఎదురుగా రావడంతో కింద పడిపోయారు. ఆమె పైనుంచి లారీ ఎక్కడంతో క్షణాల్లో ప్రాణం విడిచినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన పెండం విజయలక్ష్మి (55), కొడుకు రాజు, కోడలుతో కలిసి పట్టణంలో పనులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ఢీ కొనడంతో విజయలక్ష్మి తలకు తీవ్ర గాయమై హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మరణించింది. కొడుక్కు కాలు విరగ్గా కోడలుకు గాయాలైనట్టు సీఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్దాపూర్కు చెందిన అనిల్కుమార్ (29), స్నేహితులు రాజ్కుమార్, సాయికిరణ్లు బైకుపై ఏడుపాయల దుర్గాభవాని దేవస్థానానికి వెళ్తున్నారు. ఆందోల్ పరిధిలోని చింతకుంట ప్రధాన రహదారిపై వాహనం అదుపుతప్పి కిందపడటంతో అనిల్ అక్కడే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రిలో ఉంచారు.