Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమల్లో జరుగుతున్న జాప్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్లోని గన్ఫౌండ్రీలో టీపీటీఎఫ్ కార్యాలయంలో ఎస్సీ,ఎస్టీటీయూ అధ్యక్షులు జాడి రాజన్న అధ్యక్షతన యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె జంగయ్య, చావ రవి (టీఎస్యూటీఎఫ్), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), టి లింగారెడ్డి (డీటీఎఫ్), యు పోచయ్య (ఎస్టీఎఫ్), కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి (బీటీఎఫ్), బి కొండయ్య, ఎస్ మహేష్ (ఎంఎస్టీఎఫ్), శాగకైలాసం (ఎస్సీఎస్టీయూఎస్) తదితరులు పాల్గొన్నారు. మధ్యంతర భృతి (ఐఆర్), పీఆర్సీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు 20 నెలలు గడుస్తున్నా అమల్లోకి రాలేదని తెలిపారు. 2018, జులై ఒకటి నుంచి అమలు జరగాల్సిన వేతన సవరణ కోసం మూడు నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ నివేదిక గడువు 30 నెలలకు పెంచడం ఉద్యోగులను వంచించడమేనని అభిప్రాయపడ్డారు. ఐక్య ఉద్యమం ద్వారా హక్కుల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల ఐక్యతకు జాక్టోతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి వేసవి సెలవుల్లో పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులకు అనుగుణంగా 2004, సెప్టెంబర్కు ముందే ఎంపికై ఆ తర్వాత కాలంలో ఉద్యోగాల్లో నియామకమైన ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపచేయాలని కోరారు. పదోన్నతుల్లో ఎస్సీఎస్టీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. కేజీబీవీ ఉద్యోగులకు పనికి తగిన వేతనాలు ఇవ్వాలనీ, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు వేసవిలో చేపట్టాలనీ డిమాండ్ చేశారు.