Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వట్పల్లి
అప్పుల బాధ భరించలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పోతులగూడ గ్రామశివారులో శనివారం జరిగింది. ఎస్సై దశరథ్ వివరాల ప్రకారం.. అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్కు చెందిన యాదగిరి(36) రెండేండ్లుగా పదెకరాలు కౌలు తీసుకుని పత్తి పండిస్తున్నాడు. మొదట్నుంచీ ఆశించిన దిగుబడి రాక పోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన మూడు లక్షల రూపాయల అప్పులు తీర్చడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో భార్యకు ఫోన్ చేసి 'నేను పురుగుల మందు తాగి చనిపోతున్నాను ఇద్దరు పిల్లలు జాగ్రత్త' అని ఫోన్ పెట్టేశాడు. స్థానికుల సహాయంతో పెద్దాపూర్ శివారులో వెతికినా కనిపించలేదు. పోతులగూడ గ్రామ శివారులో మజీద్ వెనుక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.