Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంతో మోడీ సర్కార్ దేశీయ పాడి, పౌల్ట్రీ రంగాలను నాశనం చేసేందుకు పూనుకుందనీ, డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాపిత నిరసనలు చేపటాలని ప్రజలకు ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందం ద్వారా ప్రతి ఏడాది రూ.42 వేల కోట్ల విలువైన పాల, పౌల్ట్రీ, వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి అవుతాయరనీ, పాడి, పౌల్డ్రీ రంగంపై ఆధారపడిన పది కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కార్పొరేట్ల ప్రయోజనంకోసం వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ కుట్రలు పన్నుతున్నారన్నారు. భారత్లో వ్యవసాయాన్ని దెబ్బతీసి, వ్యాపార కేంద్రంగా మార్చుకోవాలన్న అమెరికా ఆలోచనలకు మోడీ స్వాగతం పలకడం స్వార్థ ప్రయోజనాలకోసమేనని విమర్శించారు. అమెరికాతో మన ఒప్పందాలు మాంద్యాన్ని తగ్గించేలా ఉండాలికానీ.. మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయన్నారు. ట్రంప్ పర్యటనతో దేశానికి జరిగే నష్టాన్ని, మోడీ వైఖరి ప్రజలకు తెలిసేవిధంగా 24న పెద్ద ఎత్తున ట్రంప్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత ఆర్థికవ్యవస్థను, స్వావలంబనను కాపాడుకోవడానికి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ బడ్జెట్లో మూడు లక్షల కోట్లకు పైగా రక్షణ రంగానికి కేటాయించిన మోడీ ప్రభుత్వం... వాటిద్వారా అమెరికా, అనుంగు దేశాలనుంచి యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందాల కోసమేనన్నారు. నిత్యం జాతీయత, దేశ భక్తి పారాయణం చేసే ప్రభుత్వం అమెరికా సామాజ్య్రవాదానికి ఊడిగమెందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ఉపాధి కల్పన గురించి పట్టించుకోకుండా వేతనాలు, కనీస మద్దతు ధర గురించి ఆలోచించకుండా చేస్తున్నారని విమర్శంచారు. రాష్ట్రానికి పన్నుల వాటా ఇవ్వకుండా కేంద్రం ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నందున ట్రంప్ వ్యతిరేక నిరసనల్లో టీఆర్ఎస్ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ భారత్ను అభివృద్ధి చెందిన జాబితాలోకి అమెరికా చేర్చడం వల్ల మన ఎగుమతులకు రాయితీలు కోల్పోతామనీ, దేశానికి తీవ్రమైన నష్టం జరగనున్నదని అన్నారు. దేశానికి కావాల్సినంత ఉత్పత్తి మన దగ్గరే జరుగుతుండగా అమెరికాతో దిగుమతుల ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. దేశ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదనీ, దీన్ని ఆపేందుకు మరో స్వాతంత్య్ర పోరాటంలా ట్రంప్ వ్యతిరేక నిరసనలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. 24వ తేదీని అమెరికన్ కాన్సులేట్ ముందు 11 గంటలనుంచి జరగబోయే నిరసనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. చేతి వృత్తిదారుల కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడుతూ ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో గీత, నేత, రజక, గొర్ల కాపర్లు అదితర వృత్తి సంఘాల వాళ్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మందుల విప్లవ్ కుమార్ మాట్లాడుతూ భారత యువతకు హెచ్1వీ-1 వీసాలు నిరాకరిస్తూ.. అమెరికా యువకులను మన దేశ యువకులపై దాడికి రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ట్రంప్ ఒక జాత్యాహంకారనీ, అలాంటి ట్రంప్ వస్తుంటే పండుగ చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించకుండా విదేశీ పెట్టుబడులను, విదేశీ యూనివర్సిటీలను తీసుకొస్తున్నదన్నారు. ట్రంప్ పర్యటన వ్యతిరేక నిరసనల్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, మధు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటురి బాలరాజుగౌడ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.