Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడా సంస్థల ప్రవేశంతో సాగు నష్టాలు
- రైతులకు రక్షణ కరువు :ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-కాశిబుగ్గ
దేశంలో రైతులకు రక్షణ కరువైందని, రైతులను దోచుకోవడానికే కేంద్ర ప్రభుత్వం స్పైసెస్ బోర్డును నీరుగారుస్తోందని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బడా సంస్థల ప్రవేశంతో వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని వివరించారు. స్పైసెస్ బోర్డును విస్తరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో అఖిలపక్ష రైతు సంఘాల, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పంటలను ప్రాసెస్, నిల్వ చేసేందుకు తగిన యూనిట్లు లేకపోవడంతో దళారులు, వ్యాపారులు లబ్ది పొందుతున్నారన్నారు. వ్యవసాయ రంగంలోకి బడా సంస్థల ప్రవేశంతో రైతులకు నష్టం వస్తోందన్నారు. రైతుల నుంచి ముడి సరుకులు కొన్న వ్యాపారులు రూ.5లక్షల కోట్ల లాభం పొందినట్టు అశోక్ మెహతా కమిటీ తన నివేదికలో తెలిపిందన్నారు. రైతుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టినప్పటికీ వారికి రక్షణ లేకుండా పోయిందన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో రైతుల కోసం అనేక రాయితీలు ఇస్తున్నట్టు వివరించారు. పసుపు, మిర్చి తదితర పంటల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. అందులో వరంగల్ కేంద్ర స్థాయిలో ఉందని తెలిపారు. 2008లో స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ దీనివల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికార పార్టీలు బోర్డును పట్టించుకునే స్థితిలో లేవన్నారు. బోర్డు రైతులకు ఉపయోగపడే విధంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. విస్తృత ప్రచారంతో రైతులకు వివరించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడం, సదస్సులు, సమావేశాలతోపాటు ఆందోళనలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. సమావేశంలో సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా ఇన్చార్జి కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, వివిధ రైతు సంఘాల బాధ్యులు కొంగల రామచంద్రారెడ్డి, ఈర్ల పైడి, బీరం రాములు, ఓదెల రాజయ్య, సోమిడి శ్రీనివాస్, లిబరేషన్ కార్యదర్శి సుద్దమల్ల భాస్కర్, చల్ల నర్సింహారెడ్డి, ఇమ్మడి కృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.