Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలకే మేలు..పేదలకు నష్టం
- టైటిల్ గ్యారెంటీ లేనట్టే !
- ఆర్వోఆర్?, టైటిల్ రిజిస్ట్రేషన్ విధానమే కొనసాగింపు
- బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్-1907లో ఏర్పాటైంది. అంతకుముందే తెలంగాణ రెవెన్యూ బోర్డు ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో వేర్వేరు రెవెన్యూ చట్టాలు అమలయ్యాయి. ఇప్పటిదాకా 250కిపైగా భూ చట్టాలు పుట్టుకొచ్చాయి. కొన్ని లొసుగులు, చిక్కులున్నప్పటికీ గత భూ చట్టాలు నిరుపేదలకు భూమిపై హక్కులు కల్పించేందుకు దోహద పడ్డాయి. యూపీ తరహా కోడ్ తెస్తే పేదలకు నష్టం జరుగు తుందనీ, ఆ కోడ్ పూర్తిగా భూ మార్కెటీకరణకు, భూ బదలా యింపు నిబంధనల సరళతరానికి, అసైన్డ్ భూమి అమ్మకాలకు తలుపులను బార్ల తెరిచే ప్రమాదముదని భూ నిపుణులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. యూపీ తరహాలో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తొలగిస్తే కార్పొరేట్లకు, బడా భూస్వాములకు లబ్ది చేకూరే ప్రమాదం పొంచి ఉంది. సీలింగ్ చట్టంలో ప్రధానంగా మూడు లోపాలున్నాయి. ట్రస్టులకు సీలింగ్ వర్తించకపోవడం, క్యాబినెట్ ఆమోదంతో ఇచ్చే వాళ్లకు సీలింగ్ లేకపోవడం, కాఫీ, రబ్బరు తోటలు వేస్తే సీలింగ్ వర్తింపజేయకపోవడం వల్ల భూమిపై కొందరికే గుత్తాధిపత్యం ఏర్పడే ప్రమాదం ఉందనే భావన భూ నిపుణుల్లో వ్యక్తమవుతున్నది. అట్లాగే, యూపీ రెవెన్యూ కోడ్లో భూ పంపిణీపై ఎక్కడా స్పష్టత లేదు. దీనివల్ల భూమి లేని పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భూ పంపిణీ అటకెక్కే ప్రమాదం ఉంది.
టైటిల్ గ్యారంటీ లేనట్టే...!
దశాబ్దాలుగా భూరికార్డుల నిర్వహణ గందరగోళం ఉంది. ఒక రికార్డుకు మరో రికార్డుకు పొంతన లేదు. పట్టాదారు పుస్తకాల్లోనూ పుట్టెడు తప్పులున్నాయి. ఫీల్డులో ఉన్న భూమికి, రికార్డులో ఉన్న భూమికి మధ్య వ్యత్యాసం ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల పట్టా భూమి ఒక దగ్గర, సాగు చేసుకునే భూమి మరో దగ్గర ఉంటున్నది. ఈ అంశాలే భూ వివాదాలకు కారణమవుతున్నాయి. అందువల్లే టైటిల్ గ్యారంటీ ఇవ్వాలనే డిమాండ్ బయలుదేరింది. టైటిల్ గ్యారంటీ అమలు చేసి భూ యజమాని నష్టపోకుండా పరిహారం ఇవ్వాలని భూ నిపుణులు, నల్సార్ యూనివర్సిటీకి చెందిన భూ చట్టాల నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టైటిల్ గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.
రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ
పోలీసు, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాల్లో చేరేటప్పుడు కచ్చితంగా శిక్షణ ఇస్తారు. కానీ, రెవెన్యూ శాఖలో ఆ పని జరగట్లేదు. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. 1985 దాకా శిక్షణ ఇచ్చేవారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత దాన్ని ఎత్తేశారు. అయితే, ప్రస్తుతం కొత్త రెవెన్యూ కోడ్లో శిక్షణ అంశాన్ని చేర్చనున్నట్టు తెలిసింది. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగులకు చట్టాల మీద అవగాహన కల్పించే అవకాశం ఉంది.
రెవెన్యూ వ్యవస్థ! 250కిపైగా రెవెన్యూ చట్టాలు. అంతా గందరగోళం. ఏ సమస్యను ఎలా చూడాలో? ఏ భూమి ఎవరిది? అని తేల్చడంలోనూ అయోమయం. లెక్కలేనన్ని సందేహాలు. కోర్టు పెండింగ్ల్లో ఎక్కువ ఇవే కేసులు...భూ సమస్యలు హత్యల వరకూ దారితీసినవి కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖపై ఎప్పుడూ చర్చ నానుతూనే ఉంది. త్వరలో కొత్త రెవెన్యూ కోడ్ను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. అయితే, యూపీ తరహాలో తేబోతున్నారన్న ప్రచారం ఆందోళన రేకెత్తిస్తున్నది. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న ప్రచారం జరుగుతున్నది. టైటిల్ గ్యారంటీ వైపు ప్రభుత్వం మొగ్గు చూపట్లేదని తెలిసింది. కొత్త రెవెన్యూ కోడ్ బిల్లు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కౌలుదారుల గురించి ప్రస్తావన లేనట్టేనా?
1950 రక్షిత కౌలు దారు చట్టం ప్రకారం 38-బి సర్టిఫికెట్ వారికి భూమిని పట్టా చేయాలి. కానీ, నేటికీ అది చేయలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పెత్తందారుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములకు చాలా వరకు పట్టాలు కాలేదు. అదే సమయంలో తెలంగాణలో ఎక్కువగా భూమి కొందరి వద్దే ఎక్కువ పోగై ఉంది. భూస్వాములు పట్టణాల్లో ఉంటుండగా వాళ్ల భూములను కౌలుదారులు ఏండ్ల తరబడి సాగు చేస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడ్డా కౌలు పోనూ వాళ్లకు దక్కేది అంతంతే. రైతు బంధునూ కౌలుదారులకు వర్తింపచేయడంలేదు. అసలు వారు రైతులుగా లెక్కలోకే రారు అన్నట్టుగా సీఎం వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే రెవెన్యూ కోడ్లో కౌలుదారుల గురించి ప్రస్తావన లేదనే చర్చ నడుస్తున్నది. జమిందారి రద్దు భూ సంస్కరణ చట్టం ప్రకారం... ఎస్సీ ఎస్టీలు, చేతివృత్తుల వాళ్లు తాము నివసిస్తున్న ప్రయివేటు, ప్రభుత్వ, పంచాయతీ భూముల క్రమబద్దీకరణ పొందవచ్చు. దశాబ్దాలుగా ఈ విధంగానే పేదలు ఇండ్ల స్థలాలను పొందుతున్నారు. యూపీ రెవెన్యూ కోడ్లో క్రమబద్దీకరించడాన్ని ఎత్తేశారు. దీంతో పేదలకు సొంత ఇంటి స్థలం దక్కకుండా పోయింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పేదలు, దళితులు, ఎస్టీలు పొరంబోకు, ప్రభుత్వ స్థలాలు, మురికికాల్వల పక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. యూపీ తరహా కోడ్ తెస్తే ఉన్న జాగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, హౌస్ సైట్లను ప్రభుత్వమే ఇస్తుందనే అంశం దాంట్లో ఉంది. ఎస్సీ ఎస్టీల వ్యవసాయ భూమి చేతులు మారకుండా గత చట్టాల్లో ఎన్నో జాగ్రత్తలున్నాయి. జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపితే తప్ప భూమి ఇతరులు కోనుగోలు చేయరాదు. యూపీ రెవెన్యూ కోడ్లో సులువుగా భూమి చేతులు మారే అవకాశాలున్నాయి. ప్రస్తుత కోడ్లో స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం ద్వారా అడ్డంకులు లేకుండా భూమి చేతులు మారే ప్రమాదం ఉంది.