Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేటీ బచావో - బేటీ పడావో ప్రచారమే తప్ప ప్రభావం శూన్యం
- ఒక్క హైదరాబాద్లోనే 10వేల మంది
- పేదరికం, సౌకర్యాల లేమి, అభద్రతే కారణం..
- బాలికావిద్యకు ప్రోత్సాహకాలివ్వని ప్రభుత్వం
తరగతి గదుల్లో భవితను దిద్దుకోవాల్సిన వాళ్లు.. చెత్త ఏరుతున్నారు. బడికెళ్లి బంగారు జీవితానికి బాటలు వేసుకోవాల్సిన వాళ్లు.. తోబుట్టువుల ఆలనాపాలనా చూస్తున్నారు. రంగురంగుల కలలు కనాల్సినవాళ్లు.. బాల్య వివాహాలతో గాడాంధకారంలో జీవనం సాగిస్తున్నారు. హక్కులెన్ని ఉన్నా.. వారికి పథకాలెన్ని పెట్టినా.. అమలులో చిత్తశుద్ధి లేకపోతే ఫలితం శూన్యం అనడానికి ఉదాహరణలు వాళ్ల నిజ జీవితాలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'బేటీ బచావో-బేటీ పడావో' అంటూ ఆర్భాటాలు చేసినా.. 32శాతం మంది బాలికలు బడిబయటే ఎందుకున్నారు? కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి!
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
'జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా ప్రభుత్వాలు వారం రోజులపాటు 'బేటీ బచావో-బేటీ పడావో' వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఉత్సవాలు జరిగిన వారం రోజులు కూడా వారిని బడికి పంపడం లేదు. అందుకు ప్రధాన కారణం... పథకానికి కేటాయిస్తున్న నిధుల్లో ఈ ఐదేండ్లలో సగానికి పైగా ప్రచారానికే సరిపోయాయి. మిగిలిన దాంట్లో పావు వంతు బడ్జెట్ను రాష్ట్రాలకు విదిలిస్తే... అవి క్షేత్రస్థాయికి చేరడం లేదు. దేశవ్యాప్తంగా 14ఏండ్లలోపు బాలికల్లో 37 శాతం బడి బయటే ఉన్నారు. అందుకు మన రాష్ట్రం మినహాయింపేమీ కాదు. 32శాతం బాలికలు బడిలో పేరు నమోదు చేసుకోలేదు. ఒకవేళ బడికి వెళ్లినా... పదో తరగతికి వచ్చేనాటికి కేవలం అందులో 30శాతం మంది మిగులుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాలు, నగరాల్లోనూ ఇదే పరిస్థితి. జీఎచ్ఎంసీ గణాంకాల ప్రకారం హైదరాబాద్లో 1476 మురికివాడలున్నాయి. ఉపాధి కోసం వలసలు వచ్చిన కుటుంబాలే జీవిస్తున్నాయి. అందులో దాదాపు 20 వేల మంది బాలబాలికలు బడి బయట ఉన్నారు. అందులో 60శాతం బాలికలే. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే.
కారణాలనేకం...
కుటుంబం మీద భారమేదైనా అది ఆడపిల్లల చదువుల మీదనే ప్రభావం చూపిస్తున్నది. తల్లిదండ్రులు కూలికి పోతే తనకంటే చిన్నవాళ్లను చూసుకోవడానికి ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. అప్పటిదాకా గ్రామాల్లో రెండో, మూడో చదివినవాళ్లు కొనసాగించేందుకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదు. ప్రయివేటు పాఠశాలలకు పంపించే ఆర్థిక స్థాయి వారికి ఉండటం లేదు. ఇతర కారణాలతో అమ్మాయిలను తల్లిదండ్రులు చదువు మాన్పించేస్తున్నారు. ఏడునుంచి పదో తరగతి చదువుతున్న బాలికలు బడి మానేయడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రత్యేకించి బాత్రూమ్లు లేకపోవడం. ఉన్నా అందులో నీటి సౌకర్యం అందుబాటులో ఉండదు. అమ్మాయి ఎదిగాక భద్రత లేదన్న భయం వారిని ఇంటికే పరిమితం చేస్తున్నది. మురికివాడల్లో బతుకుతున్న వాళ్ల ప్రధాన ఉపాధి చెత్త ఏరడం, ఇండ్లలో పని. బడి మాన్పించిన పిల్లలను తమకు సాయంగా ఉంటుందని చెత్త ఏరడానికి వెంట తీసుకెళ్తున్నారు. ఇండ్లల్లో పని మనుషులుగా పెడుతున్నారు. ఇవేవీ సాధ్యం కాకపోతే పెండ్లి చేసి పంపించేస్తున్నారు. గ్రామాల్లో నేటికీ బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదరికం కారణంగా కొనసాగుతున్న ఈ దురాచారానికి గ్రామం, పట్టణం, నగరం అన్న తేడా లేదు. పెండ్లి చేసేందుకు ఇచ్చే ప్రోత్సాహకాలకు బదులు విద్యకు కేటాయిస్తే ఫలితాలు మరోలా ఉంటాయన్నది విద్యావేత్తల సూచన.
ప్రచారానికే..
'బేటీ బచావో-బేటీ పడావో అద్భుత ఫలితాలిచ్చింది' అంటూ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. కానీ ఫలితాలు అంతంతే. నిధులన్నీ ప్రచారానికి తప్ప... ఆడపిల్లల పట్ల గౌరవం పెంచడానికి, వారిని చదువుకునేలా ప్రోత్సహించడానికి ఉపయోగపడ లేదు. ప్రత్యామ్నాయాలు చూపకుండా... ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదనడానికి ఈ పథకాలే సాక్ష్యం.
రక్షించని పథకం...
మన రాష్ట్రంలో 2016-17 సంవత్సరంలో వెయ్యి మంది బాలురకు గాను బాలికలు 918 మంది ఉండగా, 2017-18కి ఆ సంఖ్య 901కి తగ్గింది. అంటే తిరోగమనంలో ఉన్నాం. హైదరాబాద్నే జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 1000 మంది బాలల నిష్పత్తికి బాలికల సంఖ్య కేవలం 918 మాత్రమే. 2017లో 958కి పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ప్రచారం ఎంత చేస్తున్నా... దాని ప్రభావం ఉండటం లేదు. కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే అందిస్తున్న ప్రోత్సాహకాలు... ఆడపిల్ల భారమన్న భావన తల్లిదండ్రుల మనసుల్లోంచి పోగొట్టడం లేదు. పీసీపీఎన్డీటీ వంటి చట్టాలేవీ ఆడశిశు మరణాలను, బ్రూణహత్యలను ఆపడం లేదు. దానికి ప్రధాన కారణం ఆడపిల్లల చుట్టూ ముడిపడి ఉన్న అనేక సామాజిక, ఆర్థికాంశాలు. వాటి మూలాలను అన్వేషించకుండా, పరిష్కార మార్గాలు చూపకుండా బేటీ బచావో అంటూ ఎన్ని నినాదాలిచ్చినా ప్రయోజనం శూన్యం. మూఢాచారం ఏదైనా మూలాలు కదిలించకుండా పోదు. సౌకర్యాలు కల్పించకుండా, భద్రత ఇవ్వకుండా బతిమాలినా బడికి వెళ్లరు. కేటాయించే నిధులు... పైపైన ప్రచార ఆర్భాటాలకు కాకుండా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కేటాయిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు బాలల హక్కుల నేతలు.
తమ్ముడిని చూసుకుంటందుకు...
మా నాన్న కూలి జేస్తడు. మా అమ్మ స్వీపర్ పనిచేస్తది. తమ్ముడిని చూసుకుంటందుకెవ్వరు లేరని నన్ను ఇంటికాడనే ఉంచిండ్రు.
- హారిక
ఆధార్ కార్డ్ లేదని...
మాకు చదువుకోవాలని ఉంది. కానీ ఇంతకుముందు అమ్మమ్మోళ్లింటికాడ ఉండేవాళ్లం. ఇక్కడికొచ్చినంక బడికి పోదామంటే ఆధార్ కార్డ్ లేదని చేర్చుకోలేదు. మా అక్కచెల్లెళ్లిద్దరం ఇంటికాడనే ఉంటున్నం.
- శిరీష, గంగోత్రి