Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి.. బయటపడ్డ మరో ఇద్దరు కార్మికులు
- కుప్పకూలిన నిర్మాణంలోని బాయిలర్
- శిథిలాల కింద పది మందికిపైగా కార్మికులు?
నవతెలంగాణ-కాగజ్నగర్
కుమురంభీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లులో భారీ ప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నూతన బాయిలర్ కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద పన్నెండు మంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 12.30 గంటల వరకు తెలిసిన సమాచారం మేరకు ఒకర్ని బయటకు తీయగా అతను మృతిచెందాడు. గాయపడ్డ మరో ఇద్దర్ని స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని శిథిలాల కింద గుర్తిస్తున్నారు. రాత్రి షిఫ్టులో భాగంగా పనిచేస్తున్న కార్మికులే ఈ ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. విద్యుత్ తయారీ కోసం నూతన బాయిలర్ నిర్మాణం చేపడుతుండగా అది కుప్పకూలడంతో సిమెంటు గడ్డలు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా పక్కనే ఉన్న కార్మికులపై పడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది బీహార్, యూపీకి చెందిన కార్మికులే ఉన్నట్టు సమాచారం. మూడేండ్లు మూతపడి ఏడాది క్రితమే పునరుద్ధరించిన ఈ మిల్లును ప్రస్తుతం జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిర్వహిస్తోంది. స్కిల్డ్ కార్మికులను బీహార్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి అధికంగా తీసుకున్న యాజమాన్యం.. స్థానికులను కాంట్రాక్ట్ లేబర్ లెక్కన మట్టి, ఇతర పనులు చేసేందుకు నియమించుకుంది. దీనిపై ఇప్పటికే స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ కోసం బాయిలర్ పనులు కొనసాగుతుండగా ఈ దుర్ఘటన చోటుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.