Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరణ ఇవ్వాలని సర్కారు ఆదేశం
- నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు
- ఇంటర్ బోర్డు హెచ్చరిక
- 25న హైకోర్టుకు నివేదిక : జలీల్
- ప్రభుత్వానికి సహకరిస్తాం : టీపీజేఎంఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలు పాటించకుండా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పడనుంది. ఆ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు రంగంసిద్ధమైంది. నిబంధనలు పాటించని కాలేజీలను మూసేస్తారా?... లేక వేరే భవనంలోకి మారుస్తారా?అని రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 79 కాలేజీ యాజమాన్యాలకు ఆదివారం షోకాజు నోటీసులు జారీ చేయనుంది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్పొరేట్ కాలేజీలపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఈనెల 17న ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ కాలేజీలతో కుమ్మక్కయ్యారా?అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, కాలేజీయేట్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు గౌరి సతీష్, ఎస్విసి ప్రకాశ్, పరమేశ్వర్, జి రమణారెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫైర్ ఎన్వోసీ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ కొనసాగే ప్రసక్తే లేదని అధికారులు వివరించారు. ఫైర్ ఎన్వోసీ లేకుండా వచ్చే విద్యాసంవత్సరం ఇదే భవనాల్లో కొనసాగడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అధికారులు ఆ కాలేజీలను తనిఖీ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లోపాలుంటే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వేరే భవనాల్లోకి తమ కాలేజీలను మారుస్తామని శ్రీచైతన్య, నారాయణ గ్రూపు విద్యాసంస్థల ప్రతినిధులు అఫిడవిట్ సమర్పించారు. రాష్ట్రంలో ఫైర్ ఎన్వోసీ లేని ప్రయివేటు జూనియర్ కాలేజీలు 79 ఉన్నాయి. ఆ కాలేజీ యాజమాణ్యాలకు ఆదివారం ఇంటర్ బోర్డు నోటీసులు జారీ చేయనుంది.
హైకోర్టు ఆదేశాలు పాటించాలి : జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి
ఫైర్ ఎన్వోసీ లేదనీ, ఇతర నిబంధనలు పాటించడం లేదనీ హైకోర్టులో పిల్ వేశారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. ఆ కాలేజీలను తనిఖీ చేసి తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలతో ఈనెల 25న హైకోర్టులో నివేదిక సమర్పిస్తామని వివరించారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని యాజమాన్యాలను కోరారు. వేరే భవనాల్లోకి వెళ్తామని కాలేజీ యాజమాన్యాలు తమ దృష్టికి తెచ్చాయని చెప్పారు. ఫైర్ ఎన్వోసీ లేని కాలేజీలకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. మూడు, నాలుగేండ్ల నుంచి వేరే భవనాల్లోకి మారుస్తామని ఆ కాలేజీ యాజమాన్యాలు చెప్తూనే ఉన్నాయనీ, అయినా అక్కడే నడిపిస్తున్నాయనీ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో అదే భవనాల్లో ఉంటే వాటిని మూసివేస్తామని హెచ్చరించారు.
కార్పొరేట్ కాలేజీలపై చర్యలు చేపట్టాలి : గౌరి సతీష్
నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీష్ అన్నారు. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము సహకరిస్తామని చెప్పారు. ప్రయివేటు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించారని వివరించారు. రాష్ట్ర డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు ఎస్విసి ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కార్పొరేట్ కాలేజీల విచ్చలవిడితనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని అన్నారు. తమ కాలేజీల్లోనూ లోపాలుంటే సరిదిద్దుకుంటామన్నారు.