Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి శ్రీకారం
- మంత్రి కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పట్టణాల రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన 'పట్టణ ప్రగతి' కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్నదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ, పురపాలక అధికారులు కార్యక్రమం విజయవంతానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేడు మహబూబ్నగర్ పట్టణంలో ప్రారంభం కానున్న కార్యక్రమంలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. ఆయా జిల్లాలు, పట్టణాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కావాల్సిన కార్యాచరణ చేపట్టేందుకు ఇప్పటికే అన్ని మున్సిపాల్టీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, గ్రీనరీ, పౌరసేవలను మెరుగుపర్చడం వంటి ప్రాథమిక లక్ష్యాలను నిర్ణయించినట్టు తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్తను తరలించడంతోపాటు మురికి కాల్వలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు ప్రతి వార్డుకో ప్రత్యేకాధికారిని నియమించాలని పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
పది రోజులకుగాను ప్రణాళికాబద్దంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్్ కోసం అవసరమైన స్థలాల గుర్తింపు వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలను, ఇందుకు అవసరమైన ఇయర్ క్యాలెండర్ను ప్రకటించాలని కోరారు. పట్టణ ప్రగతి ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణ ప్రగతిలో పౌరుల భాగస్వామ్యం చాలా అవసరమన్నారు. ఇందుకుగాను ప్రతి వార్డులో కమిటీలను ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకోసారి వార్డు కమిటీల సమావేశం నిర్వహించడం, ఆయా అంశాలపై చర్చించి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. లక్ష్యాలను నిర్దేశించేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి కోరారు.