Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 నుంచి పాదయాత్రలు
- మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెంబర్ 51 ప్రకారం వేతనాలను వెంటనే చెల్లించాలనీ, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ ప్రకటించారు. చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 12వ తేదీన ఆరు ప్రాంతాల నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతిరెడ్డి అధ్యక్షతన ఆ యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం సమావేశ నిర్ణయాలను ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ మీడియాకు వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందివ్వాలన్నారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత రూ.8,500 వేతనం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ందనీ, ఇప్పుడు జీఓ అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. జీతాల ఆశచూపెట్టి రెండు పల్లెప్రగతి కార్యక్రమాల్లో కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించు కున్నదన్నారు. కార్మికుల్ని కట్టుబానిసలు చేసే విధంగా స్వచ్ఛంద కార్మికులతో మల్టీపర్పస్ విధానాన్ని అంగీకరిస్తున్నట్టు బలవంతంగా అంగీకార పత్రాలు రాయించుకోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 51ని ఆసరాగా తీసుకుని సర్పంచ్లు, అధికారులు కార్మికులతో ఇంటి పని, సొంతపని, ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకం, చివరకు పశువుల పేడ సేకరణ లాంటి పనులు కూడా చేయించుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, ఆఫీస్ బేరర్స్ జి.ఈశ్వర్, గణేష్, మహేష్,పాండు, మాధవి, శంకర్, సాంబయ్య, దశరథ్, రాజలింగ్, కొక్కోండు పాల్గొన్నారు.