Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల్లో 12 మంది మృతి
- హైదరాబాద్లో వేర్వేరుచోట్ల ఆరుగురు..
- మద్యం మత్తులో స్తంభాన్ని ఢీ కొని ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
- పెద్దపల్లి జిల్లాలో లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్..
- మిగతాచోట్ల పది మందికి తీవ్రగాయాలు.. పలువురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-మలక్పేట/బంజారాహిల్స్/హయత్నగర్/కోల్సిటీ/వర్గల్
సెలవు రోజైన ఆదివారం రాష్ట్రంలోని రహదారులు మరోసారి రక్తమోడాయి. అతివేగం.. కొందరి నిర్లక్ష్యం.. వెరసి రెప్పపాటు క్షణాల్లో 12మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో మద్యం మత్తులో చెట్టును ఢీ కొని ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరణించగా.. నగరంలోనే మిగతాచోట్ల మరో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. బంజారాహిల్స్లో తెల్లవారుజామున మితిమీరిన వేగంతో ఓ కారు బీభత్సం సృష్టించగా.. అక్కడెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో మరో నలుగురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. పదిమంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.
సైదాబాద్కు చెందిన వినాయక్(29), సాయి(29), శ్రీరామ్(29) నగరంలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్లు కాగా చైతన్యపురిలోని వెంకటసాయి రెసిడెన్షిల్కు చెందిన కళ్యాణ్(27) నలుగురు ప్రాణ స్నేహితులు. శనివారం
సాయంత్రం టీఎస్11 ఈజి 0054 నెంబరు గల కారులో గుర్రంగూడకి వెళ్లి మద్యం తాగారు. ఆదివారం తెల్లవారు జామున 1:50 నిమిషాల సమయంలో డిన్నర్ చేయడానికి సైదాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మద్యం మత్తు, ఓవర్ స్పీడ్ కారణంతో కర్మన్ఘాట్లోని సిందూర హోటల్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. వినాయక్, సాయి, శ్రీరామ్లు అక్కడిక్కడే మృతిచెందగా కళ్యాణ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. సరూర్నగర్ పోలీసులు కళ్యాణ్ను స్థానిక జీవన్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
- హయత్నగర్లోని ఆనంద్నగర్కు చెందిన ఏలియా(60) రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి. పోలీస్స్టేషన్ వెనుక చర్చికి వెళ్లేందుకు మూన్లైట్ బార్ వద్ద రోడ్డు దాటుతుండగా ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్పేట వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గమనించక ఆమెను ఢీ కొట్టాడు. లారీ ఆమెపైకి ఎక్కడంతో ప్రాణం కోల్పోయింది. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం రహామత్ కాలనీకి చెందిన సంగీ సాయి సురేష్(19) ప్రయివేటు ఉద్యోగి. కాజామోయిద్దిన్(20) బీటెక్ చదువుతున్నాడు. వారి సొంతూరి నుంచి ఆదివారం హైదరాబాద్కు బైక్పై వస్తుండగా విజయవాడ నుంచి వస్తున్న లారీ పెద్ద అంబర్పేటలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
- పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి యాష్పాండ్కు బూడిద తీసుకెళ్లేందుకు వెళ్తున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి బోల్తాపడింది. గోదావరిఖని లారీ డ్రైవర్ పిల్లి శ్రీనివాస్(30), క్లీనర్ మహ్మద్ అబ్దుల్ గఫూర్(20) అక్కడికక్కడే మరణించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట టిప్పర్ బైకును ఢీ కొట్టడంతో వర్గల్ మండలం మజీద్పల్లికి చెందిన శేఖర్ (20) మృతిచెందాడు. సాయిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామానికి చెందిన పాకలపాటి వెంకటేశ్వరరావు(45) బైకుపై తల్లాడ నుంచి వైరా వైపునకు వెళ్తుండగా డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీ కొని మృతిచెందాడు. భువనగిరి మండలం రాయిగిరి వద్ద శుభకార్యానికి వెళ్తూ బైకు అదుపు తప్పి తండ్రి కుమార్తె మరణించారు.
బంజారాహిల్స్లో కారు బీభత్సం
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉదయం 5.50 గంటలకు ఓ కారు అతివేగంగా వచ్చి ఫుట్పాత్ను ఢీ కొట్టింది. అడ్డుగా ఉన్న ఇనుపరాడ్ను తాకి ఆగిపోయింది. సమయానికి ఫుట్పాత్పై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదెపాడుకు చెందిన సరికొండ ఈదయ్య, అతని భార్య జయమ్మ ఖమ్మంరూరల్ మండల పరిధిలోని తీర్ధాల జాతరకు బైకుపై వెళ్తుండగా కారు ఢీ కొట్టడంతో గాయపడ్డారు. నల్లగొండ కలెక్టరేట్లో జరిగే సమావేశానికి పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ కమిలి, ఆమె భర్త బీమ్లానాయక్, 9వ వార్డు కౌన్సిలర్ ఐల మల్లమ్మ, ఆమె కుమారుడు ఐల వెంకన్న కారులో బయల్దేరారు. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో కమిలి, బీమ్లానాయక్లకు స్వల్ప గాయాలు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారంకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ భయ్యాగాని సాంబయ్య, భార్య స్వరూపతో కలిసి పరకాలకు బైకు వెళ్లివస్తుండగా కారు ఢీ కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.