Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారి గుర్తింపు
-అనుమానితులను
-ఆస్పత్రులకు తరలింపు
- 15 మందిలో కరోనా పాజిటివ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం, అందులో ఎక్కువ మంది ఢిల్లీలోని ఒక సమావేశానికి వెళ్లి వచ్చిన వారందరికి పరీక్షలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల వారీగా గుర్తించి అనుమానితులకు చేసిన పరీక్షల్లో 15 మందికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో మొత్తం 77 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న వారి సమాచారాన్ని సేకరించి ఇతరుల నుంచి విడిగా ఉంచే పనిని సర్కారు వేగవంతం చేసింది. ఆ సమావేశంలో పాల్గొని వచ్చిన ఇండోనేషియా దేశస్తులతో పాటు పలువురు కరోనా బారిన పడ్డ సంగతి విదితమే. సమావేశంలో పాల్గొని వచ్చిన రాష్ట్రానికి చెందిన వారిలో ఇప్పటికే ఆరుగురు మరణించడంతో సర్కారు అప్రమత్తమైంది.
ఈ మేరకు సోమవారం రాత్రి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్, వైద్యఆరోగ్యశాఖ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా వెతుకులాట ప్రారంభించారు. రాష్ట్రం నుంచి 1030 మంది ఆ సమావేశంలో పాల్గొన్నట్టు అంచనా. మంగళవారం సాయంత్రానికే దాదాపు వారందరిని గుర్తించి అనుమానిత లక్షణాలున్న వారిని ఆస్పత్రులకు, మిగతా వారిని క్వారంటైన్ కు పంపించి పర్యవేక్షిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 603 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. వారంతా స్వచ్ఛందంగా తమ వివరాలు వెల్లడించాలనీ, లేదా అలా వెళ్లి వచ్చిన వారి వివరాలు తెలిసిన వారెవరైనా సరే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పలువురు స్వచ్ఛందంగా తమ వివరాలు వెల్లడించగా, మరికొంత మందికి సంబంధించి వచ్చిన సమాచారంతో అధికారులు అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో దాదాపు 150 నుంచి 200 మంది మంగళవారం పరీక్షలు చేయించుకునేందుకు బారులు తీరారు. అయితే వీరిలో అనుమానిత లక్షణాలున్న వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి నమూనాలు సేకరించారు. మిగిలిన వారిని హౌం క్వారంటైన్కు పంపించినట్టు తెలిసింది. హైదరాబాద్లో మియాపూర్లో 15 మందిని గుర్తించారు. మరో మూడు ప్రాంతాల్లో ఒక్కొక్కరి చొప్పున మొత్తం 18 మందిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమావేశా ల్లో జిల్లాల్లో గుర్తించిన వారిని మూడు రకాలుగా విభజించా లనీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం లక్షణాలు లేని వారిని హౌం క్వారంటై న్ చేయాలనీ, మిగతా వారిలో కొద్ది మేరకు లక్షణాలున్న వారిని ఆయా జిల్లాల్లోనే ఐసోలేషన్ వార్డులకు తరలించగా, కొద్ది మందిని మాత్రం హైదరాబాద్ లోని గాంధీ తదితర ఆస్పత్రులకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో క్రిష్ణపూజారీ తదితర సామాజిక సేవకులు రోగులకు ఆహారం, త్రాగునీరు తదితర సదుపాయాలను కల్పించి ఆదుకున్నారు.
అడ్డుకోవద్దు....పోలీసులకు సర్కారు ఆదేశం
డయాలసిస్, తలసేమియా, సికెల్ సెల్ జబ్బులతో ఉన్నవారికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. గర్భిణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు యధావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది.