Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పింఛనర్ల జీతాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 27ను విరమించుకోవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. జీతాల్లో కోతపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కోతల్లేకుండా పూర్తి వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు 50 శాతం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం కోత విధించాలని నిర్ణయించడం అన్యాయమని విమర్శించారు. కరోనాను ప్రజలంతా క్రమశిక్షణతో ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అధినేత కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు గొప్ప కృషి చేస్తున్నారని తెలిపారు. లాక్డౌన్ బాగా అమలవుతున్నదని వివరించారు. ఏడురోజుల లాక్డౌన్ కాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకోవడం ఊహించలేకపోతున్నానని తెలిపారు. ఎందుకు ఇలా జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం అప్రజాస్వామికమని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల ప్రయివేటు సంస్థల్లో పనిచేసే వారికి జీతమే చెల్లించే అవకాశం ఉండబోదని తెలిపారు. విపత్తు వచ్చినపుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల జీతాలు, పింఛన్ ఏకమొత్తాలు కోత విధించకుండా వారివారి ఆదాయాల ఆధారంగా విరాళాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వాలని కోరారు.