Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లాక్డౌన్తో ఇండ్లకే కూలీలు పరిమితం
- తెరపైకి నిరుద్యోగ భృతి కల్పించాలనే డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి హామీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్ నుంచి ఆ పనులకు మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కూలీలకు నిరుద్యోగ భృతి ఇచ్చే అంశంపై పాలకులు ఆలోచిస్తే బాగుంటుందన్న భావన వినిపిస్తున్నది.
మన రాష్ట్రంలో 53, 15,230 ఉపాధి హామీ జాబ్కార్డులున్నాయి. వ్యవసాయ పనులు తక్కువగా ఉండటం, ఎండలతో ఇతర పనులు దొరక్కపోవడం వల్ల ప్రతిఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూలీలు ఎక్కువగా ఉపాధి హామీ చట్టంపైనే ఆధారపడి బతుకుతారు. తద్వారా దాదాపు కోటీ ఎనభై లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ఉపాధి కూలీలపై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. లాక్డౌన్తో కూలీలు ఇండ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. బయట ఎవ్వరిని కలిసినా..ముట్టుకున్నా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇక్కడ కీలకం. ఉపాధి హామీ పనులన్నీ సాధారణంగా కూలీలు ఉమ్మడిగా, గుంపుగా చేసేవే. భౌతిక దూరం పాటించడం అస్సలు సాధ్యం కాదు. పనిప్రదేశాల్లో తాగడానికే నీళ్లు లేక...నీడ లేక ఉపాధి కూలీలు చనిపోయిన ఘటనలెన్నో మన రాష్ట్రంలో చూశాం. అలాంటి చోట్ల గంటకోసారి కడుక్కోవడం, భౌతికంగా దూరంగా ఉండి పనిచేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యమయ్యేది కాదు. గుంపులుగా పనిచేసే క్రమంలో ఒక్కరికి వైరస్ సోకినా అందరికీ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోవైపు గ్రామాల్లో ఊర్లో నుంచి జనం బయటకు వెళ్లకుండా కాపలా కాస్తున్న పరిస్థితి. కొన్ని గ్రామాల్లో ముండ్ల కంచెలు కూడా వేస్తున్నారు. గ్రామాల్లో కొన్ని చోట్ల వ్యవసాయ పనులకు వెళ్లినా గ్రామస్తులు, స్థానిక అధికారులు చేన్ల దగ్గరకు వెళ్లి మరీ ఇండ్లకు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు చేయడానికి క్షేత్రస్థాయిలో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పనులు కల్పించేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎంతో కొంత ఆసరాగా నిలుస్తున్న పనులు కూడా ఆగిపోవడంతో కూలీలు తలలు పట్టుకుంటున్నారు. పనుల్లేక ఇబ్బంది పడుతున్న వారిలో ఎక్కువగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగుతుల వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనే నిబంధన చట్టంలో స్పష్టంగా ఉంది. అదే సమయంలో కూలీలు అనారోగ్య సమస్యలకు గురైనా వైద్య ఖర్చులు భరించాలి. అత్యవసర ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వాలి. వీటన్నింటినీ పక్కనపడేసి ఉపాధి కూలీలకు మినహాయింపు ఇస్తామని ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుద్యోగ భృతి ఇవ్వాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. లాక్డౌన్తో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో పనులు నిర్వహించాలని చెప్పడమే పెద్ద తప్పిదం. చట్టం ప్రకారం ఉపాధి హామీ కూలీలందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రభుత్వం ఇస్తామన్న రూ.1500లతో పాటు వలస కార్మికులకు ఇస్తున్నట్టుగానే ప్రతి ఒక్క కూలీకి 12 కేజీల బియ్యం, రూ.500 ఇవ్వాలి.