Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అనారోగ్యం, వయస్సును పరిగణనలోకి
తీసుకోవాలి : వామపక్షాలు, టీజేఎస్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా నేపథ్యం, వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రముఖ విప్లవ కవి వరవరరావును విడుదల చేయాలని వామపక్షాలు, టీజేఎస్ పార్టీ కోరాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తో పాటు సాదినేని వెంకటేశ్వరరావు (సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), పోటు రంగారావు (సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), ప్రసాదన్న (సీపీఐ ఎంఎల్), తాండ్రకుమార్ (యంసీపీఐ(యూ)), జానకిరాములు (ఆర్ఎస్ పీ), బి.సురేందర్రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), రాజేష్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్) బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వరవరరావు ప్రస్తుతం ఉంటున్న మహారాష్ట్ర జైలులోనే ఒక ఖైదీ కరోనా సోకి మరణించిన నేపథ్యంలో ఆయన ముగ్గురు కూతుళ్లు తమ తండ్రిని విడుదల చేయాలని బాంబే హైకోర్టు న్యాయమూర్తికి చేసుకున్న విజ్ఞప్తిని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి మహారాష్ట్రలో జైళ్లలోనూ వ్యాపిస్తున్నదని పేర్కొన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఖైదీలను పెద్ద ఎత్తున బెయిల్, పెరోల్ పై విడుదల చేశారనీ, అదే విధంగా వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయని తెలిపారు.
తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 80 ఏండ్ల వయస్సు కలిగిన వరవరరావును ఇంకా జైలులో కొనసాగించడం ఆయన ప్రాణాలకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. వెంటనే తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల తరబడి పోరాడి రాష్ట్రావతరణలో ప్రత్యక్షంగా పాల్గొన్న వరవరరావు విడుదల కోసం మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో అవసరమైన ప్రయత్నాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జైళ్లలో మగ్గిపోతున్న రాజకీయ ఖైదీలను కూడా విడుదల చేయాలని విన్నవించారు.