Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రైతు భరోసా పథకం కిందరూ.18వేలు ఇవ్వాలి
- స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు రిక్తహస్తం చూపారనీ, వెంటనే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రుణమాఫీ చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతుల మద్దతుగా పలుచోట్ల సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు బుధవారం చేపట్టారు. హైదరాబాద్లోని గోల్కొండ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు నెలల సుదీర్ఘ లాక్డౌన్ వల్ల తమ పంటలను అమ్ముకోలేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గిట్టుబాటు ధరల్లేక అప్పుల భారంతో ఆత్మహత్యల పాలౌతున్న రైతుల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు జరిగిన నష్టంలో కొంతైనా వస్తుందని రైతాంగం ఆశించగా నిరాశే మిగిలిందన్నారు. రైతుల రుణాలను రద్దుచేసి తిరిగి పంట రుణాలివ్వాలనీ, పూర్తి పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకాన్ని రూ.18 వేలకు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న రైతు బకాయిలు, పంట నష్టపరిహారాలు, బీమా బోనస్ డబ్బులు ఇవ్వాలన్నారు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలనీ, వ్యవసాయానికి అవసరమైన డీజిల్ లీటరుకు 22 రూపాయలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం పంటలకు ధరలు నిర్ణయించాలనీ, పంటలన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని అన్నారు. కౌలు రైతులందరికీ నష్టపరిహారాలు, రైతు బంధు, సబ్సిడీ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలతో సహా వలసకూలీలందరికీ 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికీ మూడు నెలల పాటు 10 వేల రూపాయలు నగదు జమచేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాల ఉపసంహరణకు చేస్తున్న రైతుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె. వెంకటేష్, భూపాల్, ఎస్. రమ, కోశాధికారి వంగూరు రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బి. ప్రసాద్, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సీఐటీయూ హైదరాబాద్ అధ్యక్షులు కె. ఈశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, ఆర్. వాణి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.