Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘాల నిరసన, వినతులు
నవతెలంగాణ- విలేకరులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు, తహసీ ల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. నల్లగొండలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్కు వినతిపత్రం ఇచ్చారు. సూర్యాపేటలో కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా మునగాల, గరిడేపల్లిలోనూ తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు ఆన్లైన్లో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. అనంతరం తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జంబులయ్యకు వినతిపత్రాన్ని అందించారు. నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకు రైతు సంఘం నాయకులు వెంకట్రామ్రెడ్డి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.రాములు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ గోపాల్కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేj ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య మద్దతు తెలిపారు.