Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కార్పొరేట్లకు మోకరిల్లిన మోడీ సర్కారు
- పేదలకు రూ.7,500 ఇవ్వాలి
- కరోనా కట్టడిలో కేరళ ప్రభుత్వం ఆదర్శం
- ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరు
- ఉద్యమ ఆకాంక్షలు విస్మరించిన కేసీఆర్
- పోడు భూమి ఎకరా పోకుండా ఉద్యమం : వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకుల పిలుపు
- తొలిసారిగా ఆన్లైన్లో బహిరంగసభ
- రాష్ట్రవ్యాప్తంగా వీక్షించిన 1.15 లక్షల మంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా కమ్యూనిజానికి, ఎర్రజెండాకు తప్ప పెట్టుబడిదారీ విధానానికి లేదని వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. కరోనా కట్టడిలో కేరళలో వామపక్ష ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కానీ ఇదే విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇంకోవైపు విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదని వివరించారు. కరోనా లాక్డౌన్లోనూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల సంస్థలకు మోకరిల్లిందని మండిపడ్డారు. 'తెలంగాణ ఆవిర్భావ దినం- పీపుల్స్ డిమాండ్స్ డే' ఆన్లైన్ బహిరంగ సభ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు రామగుండం సింగరేణి గని ప్రమాదంలో మరణించిన వారికి, అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నెరవేరని ఉద్యమ ఆకాంక్షలు : చాడ
ఏ లక్ష్యం, ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో ఇప్పటికీ అవి నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక, బతుకు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ వచ్చి ఆరేండ్లు దాటినా విద్యావైద్యంలో ఎలాంటి మార్పులేదని చెప్పారు. భూరికార్డులు తప్పులతడకగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్కు నీళ్లు వస్తే తెలంగాణ మొత్తం వచ్చినట్టా?అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగం ఏమైందనీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎందుకు క్రమబద్ధీకరించలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఎందుకివ్వడం లేదన్నారు.
పెనం మీద నుంచి పొయ్యిలోకి : పోటు రంగారావు
తెలంగాణ వచ్చాక పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డ చందంగా అయ్యిందని ప్రజలు భావిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. వందల హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మేధావులు మాట్లాడలేని, పార్టీలు, సంఘాలు నిరసన తెలిపే హక్కు లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే పీడీయాక్ట్ ద్వారా అరెస్టు చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామిక ఆశలు, ఆకాంక్షల కోసం మరోపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వనరలను అమ్మేందుక కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. నియంత్రిత సాగు విధానం పేరుతో బహుళజాతి సంస్థలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దొరల పాలన, గడీల పాలన, కుటుంబ పాలన, నియంత పాలన సాగుతున్నదని విమర్శించారు. ఎస్యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పొందిందనీ, ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారనీ చెప్పారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తే సహించేది లేదని ప్రజలు ఐక్యం కావాలన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు రవి మాట్లాడుతూ రైస్మిల్లర్లు, కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల తరహాలోనే ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ రాష్ట్ర నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరిపాలయ్యిందో ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ దొరల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
తొలి ఆన్లైన్ బహిరంగ సభ విజయవంతం
రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన ఆన్లైన్ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల మంది వీక్షించారు. 2.15 గంటలపాటు ఈ బహిరంగసభ జరిగిందని సీపీఐ(ఎం) సోషల్మీడియా ఇన్చార్జీ జి జగదీశ్ చెప్పారు. ఇప్పటి వరకు చిన్న సభలు, రౌండ్టేబుళ్లు, కమిటీల సమావేశాలు జరిగాయని అన్నారు. బహిరంగ సభ నిర్వహించడం ఇదే మొదటిదని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేననీ, భవిష్యత్తులో సాంకేతిక లోపాలు లేకుండా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తామనీ అన్నారు.
సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి : తమ్మినేని
మోడీ ప్రభుత్వం అజాగ్రత్త వల్ల దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ సమయంలో 396 కేసులుంటే, అదేనెల 24న దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు 536 నమోదయ్యాయని వివరించారు. ఇప్పుడు రెండు లక్షల కేసులు దాటితే లాక్డౌన్ సడలించారని గుర్తు చేశారు. కరోనా సమయంలో కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నదని విమర్శించారు. ప్రజల బాగోగులను విస్మరించిందన్నారు. జూన్ నుంచి ప్రతి కుటుంబానికీ రూ.7,500 చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ డొల్ల అని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం మోకరిల్లిందని చెప్పారు. బొగ్గుగనులు, ప్రభుత్వరంగ సంస్థలు, చివరికి అంతరిక్షాన్ని ప్రయివేటుపరం చేస్తున్నదని వివరించారు. రక్షణ సామగ్రిని విదేశీ బహుళజాతి సంస్థలకు అప్పగిస్తున్నదని అన్నారు. కరోనా నేపథ్యంలో ముస్లిం వ్యతిరేకతను పెంచి మతచిచ్చు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజాకోణం లేదన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనీ, కరోనా కేసులు తగ్గించి ఆదర్శంగా ఉందనీ వివరించారు. విద్యావైద్యం, విద్యుత్, నీరు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో నెంబర్వన్, ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ ఉద్యోగులకు సగం జీతం ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. పోడు భూమి ఒక్క ఎకరా పోకుండా పోరాడతామని చెప్పారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేస్తామన్నారు.