Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణా బోర్డుకు టీవీవీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు వల్ల కృష్ణానది దిశనే మార్చుకుని ఆ నది భవిష్యత్ను విధ్వంసం చేసేలా ఉందనీ, ఆ నీటి తరలింపును ఆపేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య డిమాండ్ చేశారు. కృష్ణానది జలాల అక్రమ నీటి తరలింపుపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆయన బుధవారం ఫిర్యాదు చేశారు. కృష్ణానది జలాలను గుండుగుత్తగా తన ఆధీనంలోనే బంధించి పూర్తిగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం జీవో 203 జీవోను జారీ చేసిందనీ, దీనివల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని తాగు, సాగు నీరు అవకాశాలుండవన్నారు. ఎఎమ్మార్ ప్రాజెక్టు నల్లగొండ ప్రజల సుదీర్ఘ పోరాటాల త్యాగఫలమనీ, హైదరాబాద్కు తాగునీటి అందించే పెద్ద వనరని తెలిపారు. పోతిరెడ్డిపాడుకు 80 వేల క్యూసెక్కుల నీటి తరలించడం వల్ల దక్షిణ తెలంగాణలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు, జీవనోపాధి దెబ్బతింటున్నారు. హైదరాబాద్కు తాగునీరు అందించడంపైనా ప్రభావం పడుతుందన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి పథకాలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించినవేననీ, ఏపీ జీవోతో ఆ ప్రాజెక్టులన్నీ ఊహాజనితంగానే మారుతాని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ఆధారపడిన జల విద్యుత్ ప్రాజెక్టులు గత స్మృతులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందనీ, ఇవి తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ సహకారం, పారిశ్రామికరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వెలిబుచ్చారు. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటి తరలింపును అడ్డుకోవాలని కోరారు.