Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అఖిలపక్ష సమావేశం పెట్టాలి : జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టుపై ఎంత ఖర్చుపెట్టారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేశారు? ఎన్ని ఎకరాలకు నీరందించారు? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 'రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా కృష్ణా జలాల ఆధారంగా మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో గత ప్రభుత్వాల నుంచీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులకు అవసరమున్న నిధులు కేటాయించకపోవడం వల్లనే నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అధికారం చేపట్టగానే ఆ ప్రాజెక్టుల దగ్గర కుర్చీ వేసుకుని మరీ రెండేండ్లల్లో పూర్తి చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆరేండ్లు పూర్తవుతున్నా ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆవేదనతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాంతాల్లోని ప్రాజెక్టులను పూర్తిచేయాలి. ఇప్పటికైనా సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష నాయకుల సూచనలు తీసుకుని, సమగ్రంగా చర్చించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాను' అని జూలకంటి రంగారెడ్డి లేఖలో పేర్కొన్నారు.