Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వాడివేడిగా జరిగే అవకాశం
- ప్రధానంగా ఏడు అంశాలపైనే చర్చ
- రేపు గోదావరి బోర్డు భేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా నది యాజమాన్యబోర్డు హైదరాబాద్లోని జలసౌధలో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నది. ప్రధానంగా కృష్ణా నదిపై నిర్మింపతలపెట్టిన పలు ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ఫిర్యాదులతో ప్రధానంగా ఏడు అంశాలపై సమావేశంలో వాడివేడిగా చర్చనడిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ వంటి పలు ప్రాజెక్టుల అంశాలను రెండు ప్రభుత్వాలు లేవనెత్తనున్నాయి. ఈ ఏడాది నీటి కేటాయింపులు, బడ్జెట్ నిధుల విడుదల, టెలీ మెట్రీ యంత్రాల ఏర్పాటు, తదితర ఏడు అంశాలపై చర్చిస్తామని రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు మంగళవారం లేఖ రాసిన విషయం విదితమే. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ తెరపైకి రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. సమావేశంలో చర్చించే ఎజెండాను పంపించాలని రెండు రాష్ట్రాలను బోర్డు గతంలో కోరింది. కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించే ఎజెండాను మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.
శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం
గోదావరి బోర్డు సమావేశం శుక్రవారం జరుగనున్నది. ఇప్పటికే గోదావరి నీటి వినియోగంపై సీఎం కేసీఆర్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు.