Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ధాన్యాన్ని మిల్లు పట్టించుకుని వెళ్తుండగా ప్రమాదం
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చెలిమేల వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతిచెందారు. బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ధర్మారం పంచాయతీ పరిధిలో గల జీడిపల్లికి చెందిన 20 మంది తమ ధాన్యాన్ని మిల్లు పట్టించడానికి మంగళవారం సాయంత్రం ట్రాక్టర్లో చర్లకు వచ్చారు. రాత్రి చర్లలోనే నిద్రించారు. బుధవారం ధాన్యాన్ని మిల్లు పట్టించుకొని, వ్యవసాయానికి 40 బస్తాల ఎరువులు కొనుగోలు చేసి సాయంత్రం బయలుదేరారు. ప్రమాదవశాత్తు చెలిమేల గ్రామానికి దగ్గరలో ట్రాక్టర్ బోల్తా పడింది. దాంతో అత్తపండ లక్ష్మమ్మ(55), ఆమె కోడలు పండ లక్ష్మమ్మ(45), మరో కుటుంబానికి చెందిన ఎలకం కవిత(30) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కొండ యాదయ్య, ఎలకం బుచ్చయ్య, ఎలకం ముత్తయ్యను చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించినట్టు వైద్యాధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా, ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.