Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విద్యుత్ సవరణ బిల్లు ఆమోదిస్తే ప్రాంతీయ ఉద్యమాలు : సీపీఐ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. ఆ బిల్లును ఆమోదిస్తే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రజాయుద్ధం మొదలైతే మోడీ ప్రభుత్వం తట్టుకోవడం కష్టమన్నారు. విద్యుత్ సవరణ బిల్లు-2020ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్చేస్తూ హైదరాబాద్లోని కేంద్ర ఆదాయపన్ను శాఖ కార్యాలయం ఆయాకార్ భవన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నల్లబ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించాలని కేంద్ర విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ ఘనశ్యామ్ ప్రసాద్కు రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీఎంలు చెప్రాసీల్లాగా, రాష్ట్రాలు తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుని ఉద్యమించాలని సూచించారు. ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే నూతన విద్యుత్ సవరణ బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహా, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, కార్యదర్శి నరసింహా, ప్రజానాట్యమండలి అధ్యక్షులు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలయ్య, బీసీ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.