Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రక్షించే వైద్యసిబ్బందికి కరోనా
- ఉస్మానియాలో 23 మందికి... నిమ్స్లో ఏడుగురికి
- పోలీసులు, జర్నలిస్టులకూ సోకిన వైనం
- రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరిన మెడికల్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వారియర్స్పై కరోనా పంజా విసురుతున్నది. ఆపత్కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల్లో ముందువరుసలో ఉంటున్న వైద్యసిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులనూ కలవరపెడుతున్నది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23 మంది పీజీ విద్యార్థులకు, నిమ్స్లో నలుగురు రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు క్యాథలాబ్ సిబ్బందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తున్నది. 30 మందికిపైగా పోలీసులకు, 15 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చినట్టు సమాచారం. తెలిసింది. నిత్యం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏదో ఒక రకంగా సంబంధం ఉన్న ఈ మూడు విభాగాలకు కరోనా విస్తరించడం విస్మయపరుస్తున్నది. చివరకు...రక్షణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు మెడికల్ జేఏసీ తో పాటు జర్నలిస్టు సంఘాలు సూచిస్తున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. ఇప్పటివరకు కరోనా అధికంగా సోకిన రాష్ట్రాల్లో వైద్యసిబ్బంది తదితర అత్యవసర సిబ్బందిని వణికించిన కోవిడ్-19 రాష్ట్రంలోనూ అదే పరిస్థితిని కల్పిస్తున్నది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23 మంది పీజీ విద్యార్థులకు, నిమ్స్లో నలుగురు రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు క్యాథలాబ్ సిబ్బంది కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారితో కాంటాక్టులో ఉన్న వైద్యులు, రోగులు, ఇతరులను గుర్తించి క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని వైద్యసిబ్బంది కోరుతున్నారు. గతంలోనూ నీలోఫర్, ఉస్మానియా తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందిన రోగుల్లో కరోనా రావడంతో ఆ సిబ్బందిని క్వారంటైన్కు పంపించిన సంగతి తెలిసిందే. చెస్ట్ ఆస్పత్రిలో ఒక నర్సుకు కరోనా సోకడంతో గాంధీలో చికిత్స పొందుతున్నది. వ్యక్తిగత రక్షణ పరికరాలు సరఫరా చేస్తున్నామని సర్కారు చెబుతున్నప్పటికీ రోజూ వందకుపైగా పాజిటివ్ కేసులు వస్తుండటంతో పీపీఈ కిట్ల నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, నర్సులు కరోనా బారిన పడుతుండడంతో ఆయా ఆస్పత్రుల్లో సేవలందించే వారి సంఖ్య తగ్గుతున్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్ వైద్యులు కొందరు రాజీనామాలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో రోగుల సేవలకు విఘాతం కలగకుండా ఆయా ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 56 సంఘాల భాగస్వామ్యంతో ఏర్పడిన మెడికల్ జేఏసీ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని చర్చించింది. అనంతరం జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగురమేశ్, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతినిధి బృందం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి చర్చించింది. సిబ్బంది కొరత లేకండా ఐదు రోజుల పని, ఐదు రోజుల సెలవు, వైద్యవిధాన పరిషత్లో పదోన్నతుల కల్పన, కింది స్థాయిలో సిబ్బంది కొరత తీర్చాలని కోరింది. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో అత్యవసరంగా ఐదుగురు గైనకాలజీ డాక్టర్లను ఇవ్వాలని సూచించింది. పదేండ్లకు పైగా సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ నర్సుల జీతాలను పెంచాలని విజ్ఞప్తి చేసింది.
ప్రయివేటులో బయటికి రాని లెక్కలు
పలు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నా వారికి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా యాజమాన్యాలు నొక్కిపెడుతున్నాయనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా పేరుగాంచిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. మరికొంత మందిలో లక్షణాలు కనిపించినా సెలవులు ఇవ్వడం లేదని సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల్లో కింది స్థాయి సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసులు, జర్నలిస్టులను చుట్టేస్తున్న కరోనా
కరోనా కట్టడి పోరులో వైద్య, పారిశుధ్య సిబ్బందితో పాటు అత్యవసర విధుల్లో ఉంటున్న పోలీసులతో పాటు, జర్నలిస్టులను కరోనా చుట్టేస్తున్నది. ఇప్పటికే కరోనా బారిన పడి ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. మరో 30 మందికి దాకా కరోనా పాజిటివ్ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో హౌంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. 50 ఏండ్లు పైబడిన సిబ్బందిని చెక్ పోస్టుల వద్ద విధుల నుంచి మినహాయిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కరోనా బారిన పడిన అత్యవసర సిబ్బందిలో జర్నలిస్టుల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఇటీవల హైదరాబాద్ నుంచి జాతీయ మీడియాలో పని చేస్తున్న పలువురికి పరీక్షలు నిర్వహించగా నలుగురిలో పాజిటివ్ రాగా వారితో కాంటాక్టులో ఉన్న మరికొంత మందికి సోకినట్టు చర్చ జోరుగా సాగుతున్నది. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 15 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా సమాచార సేకరణ కోసం వెళ్లే పాత్రికేయులు కరోనా వారియర్ నుంచి క్యారియర్లుగా మారిపోతున్నారు. టెస్టులు చేస్తే చాలా మందికి కరోనా లక్షణాలు బయటపడే అవకాశాలున్నాయి. దీంతో పాజిటివ్ వచ్చిన మీడియా సంస్థలు సిబ్బందికి షిఫ్టుల వారీగా పని విభజన, వర్క్ ఫ్రం హౌం తదితర చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో పాటు ఇంగ్లీష్ పత్రికలు తన సిబ్బందికి సిస్టమ్స్ ఇచ్చి ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి.