Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నిస్వార్థ ప్రజా సేవకుడు
- సంతాప సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-ఖమ్మం
సీపీఐ సీనియర్ నాయకులు తుళ్లూరి వెంకయ్యచౌదరి(80) అనారోగ్యంతో మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సీపీఐ ఖమ్మం కార్యాలయంలో ఉంచారు. బుధవారం మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సందర్శించి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో వక్తలు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐకి సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి, నిస్వార్థంగా పనిచేశారని కొనియాడారు. మార్క్సిజం పట్ల అచెంచల విశ్వాసాన్ని కలిగి చివరి శ్వాస వరకు ఆ లక్ష్యం కోసం తపించిన చౌదరి మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటన్నారు. టి.వి.చౌదరి 1942 నవంబర్ 25న కొణిజర్ల మండలం తనికెళ్లలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా గిరిప్రసాద్ ఉన్నప్పుడు పార్టీ సభ్యత్వం పొంది విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. 1972 నుంచి 1975 వరకు యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. 1983లో సీపీఐ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి 15 సంవత్సరాలపాటు కొనసాగారు. 1996లో రజబ్ అలీ మరణం తరువాత ఉప ఎన్నికల్లో చౌదరి పోటీ చేసి ఓడిపోయారు. 2019 వరకు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగారు.
చౌదరి మృతికి తమ్మినేని సంతాపం
సీపీఐ సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు టివి చౌదరి మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
తీరనిలోటు : సీపీఐ
టివి చౌదరి మృతికి సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఖమ్మం జిల్లా పార్టీ ఉద్యమ నిర్మాణంలో సుదీర్ఘకాలం పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రైతుసంఘానికి అధ్యక్షునిగా సేవలందించారని పేర్కొన్నారు. ఆయన మరణం సీపీఐకి తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.