Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వామపక్ష పార్టీల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రామగుండం సింగరేణి ఓపెన్ క్యాస్ట్ 3వ యూనిట్లో జరిగిన ప్రమాదంలో కార్మికుల మృతికి వామపక్ష పార్టీలు సంతాపం ప్రకటించాయి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపాయి. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్ ఎన్డీ), తాండ్ర కుమార్ (ఎంసీపీఐయూ), కె గోవర్ధన్ (సీపీఐఎంఎల్ ఎన్డీ), మురహరి (ఎస్యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), డి రాజేశ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), బి సురేందర్రెడ్డి(ఫార్వర్డ్బ్లాక్), ప్రసాద్ (సీపీఐఎంఎల్) బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం జరిగిన రామగుండం ఓపెన్క్యాస్ట్ యూనిట్ను ఒక ప్రయివేటు సంస్థ నిర్వహిస్తున్నదని తెలిపారు. లాభార్జనేగానీ కార్మికుల రక్షణ చర్యలు కల్పించడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్య నియంత్రణ కూడా ఈ ప్రయివేటు సంస్థలపై తగినంతగా లేదని తెలిపారు. కనీస రక్షణ పద్ధతులను పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం కార్మికుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటుగా సింగరేణి సంస్థను కోల్ఇండియాలో కలపడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఓపెన్క్యాస్ట్లన్నింటినీ ప్రయివేటుపరం చేసే నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.
బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి : ఐఎఫ్టీయూ
సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్ల నలుగురు కాంట్రాక్టు కార్మికులు చనిపోయారనీ, వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఉపాధ్యక్షులు కె.సూర్యం, ఎస్ఎల్ పద్మ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.