Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొన్న ఎన్పీఆర్పై అసెంబ్లీలో తీర్మానం
- నిన్న కరోనాపై కేంద్రం చర్యలపై విమర్శ
- నేడు విద్యుత్ సవరణల చట్టంపై వ్యతిరేకత
- మారుతున్న రాజకీయ సమీకరణాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రప్రభుత్వానికి సీఎం కేసీఆర్ మరోసారి ఝలక్ ఇచ్చారు. విస్తృత ప్రజాప్రయోజనాలు, రాజ్యాంగ హక్కులు, సమాఖ్యస్ఫూర్తి వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణల చట్టం-2020ను నిర్ద్వందంగా వ్యతిరేకించారు. కేంద్రం ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అసెంబ్లీలో తీర్మానమే చేశారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్నార్సీ)లపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాభిమానాన్ని చూరగొనలేవనీ, విభజించు, పాలించు రాజకీయాలు చెల్లవంటూ అసెంబ్లీ వేదికగా గర్జించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై కూడా కేంద్రం తీరును ప్రత్యక్షంగా దుయ్యబట్టారు. ''రాష్ట్రాలు అడిగింది ఏంటీ...మీరిచ్చింది ఏంటీ...''అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంమీద సీఎం కేసీఆర్ దూకుడు ప్రదర్శించడంపై రాజకీ యంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రజల్లోనూ ఆసక్తి పెరుగు తున్నది. రెండోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ పీఠం ఎక్కాక తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలను సీఎం కేసీఆర్ ఈమధ్య ఘాటుగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బలపడాలని తాపత్రయ పడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కేసీఆర్ అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. రాజకీయంలో భాగంగానే ఆయన అలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.రాష్ట్ర బీజేపీపై కామెంట్స్ చేసి, వారికి ప్రచారం కల్పించడం సీఎం కేసీఆర్కు ఇష్టం లేదనీ చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీని నెత్తికెత్తుకొని, కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఎందుకనే ధోరణిలోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారనేది విశ్లేషకులు అభిప్రాయం. అందుకే కేంద్రంపై కేసీఆర్ కన్నెర్ర చేసినప్పుడల్లా రాష్ట్ర బీజేపీ నేతలు జబ్బలు చరుస్తూ పెడబొబ్బలు పెడుతున్నా...కేసీఆర్ పట్టించుకోనట్టే ఉంటున్నారు.
కేరళ తరహాలోనే...
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం కూడా గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలాగే కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణల బిల్లు-2020ను ఉపసంహరించుకోవాలని కోరుతూ మే 18వ తేదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ఇంథనశాఖ మంత్రి ఆర్కె సింగ్కు లేఖ రాసారు. దానిలో ఆయన ఐదు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే తరహాలో సీఎం కేసీఆర్ కూడా కేంద్రానికి ఈనెల 2వ తేదీ లేఖ రాసారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట
విద్యుత్ సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్కె సింగ్కు రాసిన లేఖలో పదునైన భాష, పదాలను వాడారు. తమ నిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పేశారు. తమకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంచేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం తమ ప్రభుత్వ విధానమనీ, దాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టలేమని చెప్పేశారు. ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థలన్నింటినీ ఆర్థికంగా కృంగతీయడమే సవరణ చట్టం ఉద్దేశ్యంగా కనిపిస్తున్నదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సమర్థిస్తున్నారు. ప్రతిపక్షాలు కేంద్ర ప్రతిపాదిత విద్యుత్ సవరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలకిచ్చే సబ్సిడీల అంశాన్ని తమకే వదిలేయాలి తప్ప, కేంద్రం వాటిని హైజాక్ చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్రం విధించే షరతులు, సంస్కరణలు అమలు చేస్తేనే నిధులు ఇస్తామంటే...ఆ డబ్బు తమకు అవసరమే లేదంటూ విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.