Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ(ఎం) డిమాండ్
-రూ.1,500 నగదు పునరుద్ధరించాలి : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కేసులు పెరుగుతుండడంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నివారణ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొన్ని రోజులుగా దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుండడం, ప్రజలను అభద్రతకు, భయాందోళనలకు గురిచేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం తెలిపింది. ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని పేర్కొంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రారంభంలో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు. కేసులు పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని అపోహలకు గురై పరీక్షలు నిలిపివేయడం సరైంది కాదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో 5 లక్షలు, 7 లక్షల పరీక్షలు నిర్వహిస్తే, తెలంగాణలో 67 వేల పరీక్షలు మాత్రమే చేశారని వివరించారు. పరీక్షలు చేయకపోవడం వల్ల కేసులు విజృంభిస్తున్నాయని చెప్పారు. పరీక్షలు చేస్తే ఆ లక్షణాలున్న వ్యక్తుల సంబంధాలను గుర్తించడం సులభమవుతుందని అన్నారు. ప్రయివేటు ఆస్పత్రులను కరోనా పరీక్షలు, చికిత్సలకు వినియోగించాలని కోరారు. కరోనా పేరుతో ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రోగులకు చికిత్స అందించి ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. డాక్టర్, పారామెడికల్, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్నారు. కార్మికులకు వేతనం ఇవ్వడం లేదన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలు బరితెగించి ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతోపాటు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడిందన్నారు. కేంద్రం రాష్ట్రాలపై పెత్తనానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. నిధులు రప్పించడం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడం లేదన్నారు. ఇంకోవైపు బీజేపీ శవరాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. జీఎస్టీ నిధులు కేంద్రం వద్దే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నెలకు 12 కిలోల బియ్యం కొనసాగించాలనీ, రూ.1,500 నగదు పునరుద్ధరించాలనీ కోరారు. కేరళ పద్ధతిలో నిత్యావసరాలు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాలని అన్నారు. కరోనా సహాయక చర్యలు కొనసాగించాలనీ, ప్రజలకు అండగా నిలబడాలనీ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.