Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 కంట్రీమేడ్ రివాల్వర్లు, బైకుల స్వాధీనం
నవతెలంగాణ-సిరిసిల్ల
ఆరుగురు జనశక్తి నక్సలైట్లను అరెస్టు చేసి వారి నుంచి రెండు కంట్రీమేడ్ రివాల్వర్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి రాజన్న వర్గం నుంచి విడిపోయిన నిందితులందరూ సీపీఐ(ఎంఎల్) రామచంద్రం వర్గంగా ఏర్పాడ్డారని తెలిపారు. వీరంతా కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతానికి వ్యాపారాలు, భూస్వాములు, రాజకీయ నాయకుల వద్ద పార్టీ చందాలు వసూలు చేయాలని నిర్ణయించారన్నారు. ఇలా నాలుగు నెలల కిందట ఆయుధాలు పొందిన కొందరు వారం రోజుల కిందట పెద్దలింగాపూర్కు చెందిన ల్యాగల తిరుపతిని రూ.5 లక్షలు పార్టీకి చందా ఇవ్వాలని బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో మండేపల్లి గ్రామ శివారులోని గుట్ట వద్ద వీరంతా సమావేశమయినట్టు పక్కా సమాచారం అందడంతో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల రూరల్ సీఐ ఎమ్డీ సర్వర్, తంగళ్ళపల్లి ఎస్ఐ అభిలాష్, సిబ్బందితో వారిని పట్టుకున్నారు. వారి నుంచి ఈ-2 కంట్రీ మేడ్ రివాల్వర్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు, 6 మొబైల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు, పార్టీ పేరుతో ఉన్న లెటర్ హెడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్, తంగళ్లపల్లి ఎస్ఐ అభిలాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.