Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డంకులు
- ఇప్పటివరకు ఒక రిజర్వాయరే పూర్తి
- 12.30లక్షల ఆయకట్టు ప్రశ్నార్థకం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా బోర్డు ప్రకటనతో ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఆగస్టు 29న ప్రాజెక్టును పరిశీలించి వచ్చే ఖరీఫ్ నాటికి రిజర్వాయర్లు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా కనీసం ఆపోచ్ కేనాల్ కూడా పూర్తి కాలేదు. భూసేకరణతో పాటు జాతీయ పర్యావరణ కమిటీకి కొంతమంది ఫిర్యాదు చేయడంతో ప్రాజెక్టు పనులు మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని కృష్ణాబోర్డు ప్రకటించడంతో ప్రభుత్వం దిక్కుతోచనిస్థితిలో పడింది. ఐదేండ్లుగా ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుండటంతో ఆయకట్టు రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం వెనుక జలాలను ఎల్లూరు పంపుహౌజ్ ద్వారా ఎత్తి నార్లాపూర్ రిజర్వాయరులో పోస్తారు. అక్కడ్నుంచి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మొదలవుతుంది. అప్రోచ్ టన్నెల్ తర్వాత ఎల్లూరు పంప్హౌజ్ వరకు, అక్కడ్నుంచి ఎదుల, వట్టెం, కర్వేనా, ఉద్దండాపూర్, లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్లన్నీ పూర్తి చేసిన తర్వాత రోజుకు 1.5 టీఎంసీల చొప్పన 60రోజుల్లో 90 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఈ సాగునీటితో 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015లో మొదట రూ.35,200 కోట్లతో ఎల్లూరు నుంచి ఉద్దండాపూర్ వరకు పనులు ప్రారంభించి రెండేండ్లలో పూర్తి చేయాలనుకున్నారు. దీనికోసం 2015 డిసెంబర్లో 27వేల ఎకరాల భూసేకరణ ప్రారంభించగా 2018 జనవరి వరకు 23,500 ఎకరాలను సేకరించారు. ఇంకా 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉన్నా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్లూరు దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల సమీపంలోనే పాలమూరు-రంగారెడ్డి లిప్టుకు సంబంధించి అప్రోచ్ కెనాల్ను ప్రతిపాదించారు. నీటి కొరత సమయంలో ఈ ప్రాజెక్టులకు నీటి లభ్యత తక్కువగా ఉంటుందని అప్పట్లో జిల్లా ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి అక్కడే పనులు మొదలుపెట్టింది. అప్రోచ్ కెనాల్ నుంచి పంప్హౌజ్ వరకు కెనాల్ కన్నా టన్నెల్ నిర్మించాలని సీఎం ఆదేశాలతో తవ్వుతున్నారు. టన్నెల్తో కేఎల్ఐ దెబ్బతింటుందని నిపుణులు చెప్పడంతో కొన్ని రోజులు పనులు ఆగిపోయాయి. తాజాగా నిబంధనలు మార్చి పనులు ప్రారంభించాలని చెప్పారు. నార్లాపూర్ రిజర్వాయరు పనులు ఇంకా 30 శాతానికి మించి చేయలేదు. ఎదుల పనులు పూర్తైనా వట్టెం, కర్వెనా పనులు జరగాల్సి ఉంది. వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయరు భూ నిర్వాసితులకు గిట్టుబాటైన పరిహారం ఇవ్వడానికి నిరాకరించడంతో అక్కడి రైతులు పనులు అడ్డుకోవడంతో ముందుకు సాగడంలేదు. రూ.4,268 కోట్లతో ప్రారంభించిన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులకు ఇంకా శంకుస్థాపన చేయలేదు.
కృష్ణాబోర్డు ప్రకటనతో సందిగ్ధం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కొత్తదని, దీనికి పరిపాలనాపరమైన అనుమతుల్లేవని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. ఫలితంగా పనులు ముందుకు సాగడంలేదు. గతంలోనే జిల్లా నాయకులు కొంతమంది ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ ప్రమాదం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరోసారి ప్రాజెక్టు సమస్య వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో చిత్తశుద్ధి ఏమాత్రం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రూ.50వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఐదేండ్ల్ల కాలంలో కేవలం రూ.8వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 23 శాతం పనులైనా పూర్తి కాలేదు. మిగితా పనులు పూర్తయ్యేనాటికి మరో పదేండ్లయినా పడుతుందని పలు పార్టీల నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు పోయినా ఉపాధి ఉంటుందనుకున్నాం
ఏదుల దగ్గర రిజర్వాయరు నిర్మిస్తే సాగునీరు పుష్కలంగా లభించి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనుకున్నాం. నాయకుల మాటలు నమ్మి నాకున్న ఐదెకరాల భూమిని రిజర్వాయరుకు ఇచ్చాను. సాగుచేసే భూమి పోయి రిజర్వాయరులో మునిగింది కానీ సాగునీరు మాత్రం రాలేదు. పంటలు పుష్కలంగా పండితే ఉపాధి దొరుకుతుందనుకున్నాం. ఇక్కడ పనుల్లేక మెస్త్రీ చేతికిందికి కూలీ పనులకు పోతున్నాం.
- రాములు, ఎదుల, వనపర్తి జిల్లా