Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆందోళనలో 'కరోనా' కుటుంబాలు
- ప్రభుత్వశాఖల హడావిడే కారణమా?
- అపార్ట్మెంట్లలో మరీ దారుణం
- హరిస్తున్న మానవసంబంధాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''మనం పోరాడాల్సింది వ్యాధితో...రోగితో కాదు'' కోవిడ్-19 నియంత్రణలో ప్రభుత్వ ప్రచారం ఇది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. భౌతికదూరం, సామాజిక దూరంగా మారుతున్నది. కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన రోగులు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరేందుకు, హౌం క్వారెంటైన్లో ఉండేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ పాజిటివ్ నిర్థారణ అయిన పేషెంట్ల ఇండ్లు, అపార్ట్మెంట్ల వద్ద జీహెచ్ఎంసీ, ఆరోగ్య, పోలీస్ శాఖలు చేస్తున్న హడావిడి చూస్తే భయం నాలుగింతలు పెరుగుతున్నది. ఈ హడావిడికే పేషెంట్లు, కుటుంబసభ్యులు బెంబేలెత్తుతున్నారు. అపార్ట్మెంట్లు అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పాజిటివ్ నిర్థారణ పేషెంట్ల కుటుంబాలను సామాజికంగా దూరం పెడుతున్నారు. పైపెచ్చు ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదంటూ సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్లే ఎక్కువ. తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివాసాలు ఉంటారు. ఓ అపార్ట్మెంట్లో పాజిటివ్ కేసు వస్తే...మిగిలిన అపార్ట్మెంట్లలోనూ అలజడి రేగుతుంది. శానిటైజేషన్ పేరుతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆయా అపార్ట్మెంట్ల వద్ద బ్లీచింగ్ పౌడర్లు చల్లడం, క్లోరిన్ నీటిని పిచికారీ చేయడం వంటి పనులు హడావిడిగా చేస్తున్నారు. ఆ వెంటనే పోలీసులు ఆ అపార్ట్మెంటుకు వెళ్లే మార్గాలను మూసివేస్తూ, బారికేడ్లు పెట్టి నానా హడావిడి చేస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరిగా పేషెంట్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తూ హడావిడి చేస్తున్నారు. ఇదంతా చూసాక ఒక్కరి వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతున్నదనే మనోవేదన పేషెంట్లు, వారి కుటుంబసభ్యుల్లో కలుగుతున్నది. తామేదో చేయకూడని పని చేసినట్టు, రాకూడని రోగం ఏదో వచ్చినట్టు ఆత్మన్యూనతాభావంతో సతమతమవుతున్నారు. పేషెంట్ను చికిత్స నిమిత్తం క్వారైంటైన్ కేంద్రానికి పంపినా, కుటుంబసభ్యులకు ఈ తలనొప్పి తప్పట్లేదు. రోగం కంటే ముందు... ఈ హడావిడికే పరువు పోయినట్టు ఫీలవుతున్నారు. కరోనా పేషెంట్ల కుటుంబాలవైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇరుగుపొరుగు సాహసించట్లేదు. మరికొన్ని అపార్ట్మెంట్లలో కరోనా కేసు వచ్చినట్టు తెలియగానే తాత్కాలికంగా ఇండ్లకు తాళాలు వేసిి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భౌతికదూరం అర్థం మారి సామాజిక దూరంగా రూపాంతరం చెందుతున్నదని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదని హెచ్చరిస్తున్నారు.
మానససంబంధాలను కరోనా మరింత బలహీనపరిచిందని చెప్తున్నారు. ''ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు పోయి, చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ చిన్న కుటుంబాలు కూడా ఛిద్రమై, వ్యక్తులుగా మిగులుతున్నారు. సామాజిక అంతరం పెరుగుతున్నది. ఇది సమాజానికి మంచిది కాదు'' అని ప్రముఖ సామాజికవేత్త, న్యాయవాది మయబ్రహ్మ నర్సింహా అబి óప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు వస్తే ప్రభుత్వ శాఖల అధికారులు అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదని, తొలుత ఆ ప్రాంతంలో అవగాహనా క్యాంపులు పెట్టి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. అంతేకాని బారికేడ్లు పెట్టి, రహదారులు దిగ్భంధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏమైనా అధికారుల హడావిడి కరోనా పేషెంట్లను, వారి కుటుంబాలనే కాకుండా, చుట్టుపక్కల ప్రజల్ని కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. దీన్ని సరిదిద్దాల్సిన తక్షణావసరం కనిపిస్తున్నది.