Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయానికి రూ 75,141 కోట్లు
- పంటరుణాలు రూ 53,222 కోట్లు :రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ 1, 61,120 కోట్లు కాగా వ్యవసాయ రంగానికి రూ 75, 141 కోట్ల రుణా కేటాయింపులు చేసింది. అందులో పంట రుణ లక్ష్యంగా రూ. 53, 222 కోట్లుగా నిర్ధేశించింది. సోమవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. దీని ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.62 శాతం పెరిగాయి. ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ 48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ.53,222 కోట్లకు పెంచింది. 9.20 శాతం అధికం చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ 12,061 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం కంటే 5.38 శాతం పెంచింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కోసం రూ .2422 కోట్లు కేటాయించింది. గతం కంటే 16.02 శాతం ఎక్కువ. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ 7435 కోట్లు ఉంది. రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాల రూపంలో అధికంగా నిధులు ప్రభుత్వం కేటాయించింది. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌళిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పనికిరాని భూములను అభివద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్ఎంఐ) రూ 35,196 కోట్లు రుణాల పంపిణీ లక్ష్యంగా ఉంది. విద్యా రుణాలు రూ 2165.73 కోట్లు, గృహ సంబంధిత రుణాలు రూ 8048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలు రూ 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేయడం గమనార్హం.
ఆత్మ నిర్బర్ కింద రుణాలు
కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్బర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్టు ఏబీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్ఎంఇలకు రూ 2513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ1688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చినట్టు పేర్కొంది. అదే సమయంలో రూ 231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్టు తెలిపింది. 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అదే విధంగా స్ట్రీట్ వెండర్లకు కూడా ప్రత్యేక రుణం ఇస్తున్నట్టు ఏబీసీ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు ఎస్బీఐ సీజీఎంవో ప్రకాశ్ మిశ్రా, ఆర్ఐ జనరల్ మేనేజర్ శంకర్ సుందరం, నాబార్డు సీజీఎం కష్ణారావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.