Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రమంగా పెరుగుతున్న నీటిమట్టాలు
నవతెలంగాణ - విలేకరులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో తెలంగాణ ప్రాజెక్టులు జలకళ సంతరించు కున్నాయి. అల్మట్టి, బాబ్లీ గేట్లు తెరవడంతో రిజర్వాయర్లలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 5621 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1071.6 అడుగుల (31.849 టీఎంసీల) నీరు నిల్వ
ఉన్నట్టు డీఈ జగదీశ్రెడ్డి తెలిపారు. గతేడాది ఇదేరోజు 1048.6 అడుగుల (5.458 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు తెలిపారు. మిషన్భగీరథకు 152 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూన్ 1 నుంచి నేటి వరకు 2.416 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టు అధికారులు తెలిపారు. ఆల్మట్టి డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 4074 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.5టీఎంసీల నీరుంది. గడిచిన 24గంటల్లో 1331 క్యూసెక్కుల నీరు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా రిజర్వాయర్లలో కూడా నీటి సామర్థ్యం పెరుగుతోంది. పాలేరు పూర్తి సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 18.5కు చేరుకుంది. వైరా చెరువులో పూర్తి సామర్థ్యం 18.3 అడుగులు కాగా ఇప్పటికే 15.3 అడుగులకు చేరింది. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 399.60 అడుగులకు నీరు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. లింకసాగర్ లో 14 అడుగులు (18 అడుగులు), తాలిపేరులో 73.80 (పూర్తి సామర్థ్యం 74 అడుగులు)కు నీటి మట్టం చేరుకుంది.