Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నాబార్డు ఎదుట తెలంగాణ రైతుసంఘం నిరసన
-పంటరుణాలు తక్షణమే ఇవ్వాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు బ్యాంకులు పంటరుణాలు తక్షణమే ఇవ్వాలనీ, వ్యవసాయ రుణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నాబార్డు కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం నిరసన తెలిపింది. అనంతరం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వానాకాలం సాగు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నదనీ, దాదాపు 60 లక్షల ఎకరాలలో పంటలు వేయడం జరిగిందని చెప్పారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ రుణ ప్రణాళికను ఆమోదించలేదన్నారు. ఒక రూపాయి కూడా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. రైతులు తమ పెట్టుబడి కోసం ప్రయివేట్ అధిక వడ్డీలకు అప్పు తెచ్చి వాళ్ళ వ్యవసాయం చేస్తున్నారన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఏకమొత్తంలో చేసి రైతులకు రుణ విముక్తులను చేస్తే వాళ్ళకు బ్యాంకులు తిరిగి కొత్త రుణాలు ఇస్తాయని తెలిపారు. కానీ ప్రభుత్వం రూ 25 వేల లోపు ఉన్న వాళ్ళకే 5.88 వేల మందికి మాత్రమే రుణ మాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మిగతా వాళ్ళకు ఒక విడత మాత్రమే చేశారనీ, ఇంకా మూడు విడతలు చేయాలన్నారు. దీంతో ఆ రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మంది రైతులున్నారనీ, బ్యాంకులు 30 లక్షల మందికి మాత్రమే అప్పులు ఇస్తున్నాయని చెప్పారు. మిగిలిన 30 లక్షల మంది ప్రయివేటు అప్పుల మీదనే ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేట్ రుణాలు తెచ్చుకోవడం, వాటిని ఆ రుణాలు తీర్చలేక ఏటా సూమారు 700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ప్రకటించిన రైతు ఆత్మహత్యలు అదే పనిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలోనే పంట రుణాలు విడుదల చేయాలన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, బొప్పని పద్మ, రాహుల్, వెంకన్న పాల్గొన్నారు.