Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే గ్రానైట్ పరిశ్రమల్లో ఒకప్పుడు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వెలుగొందింది ఖమ్మం జిల్లా. పరిశ్రమ నిరంతరాయంగా నడిచిన సమయంలో జిల్లా నుంచి 15 దేశాలకు నల్ల, తెల్ల, ఎరుపు, ఆకుపచ్చ, గోదుమ రంగు, పింకు రాళ్లను ఎగుమతి చేసేవారు. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, టర్కీ, కొరియా, సౌదీ, చైనా, తదితర దేశాలలో పర్యాటక రంగానికి, ప్రఖ్యాత కట్టడాలకు, ఇతర సుందర కట్టడాలకు, గృహ నిర్మాణాలలో ఖమ్మం జిల్లా నల్లరాయిని వినియోగిస్తారు. కూలీల్లో ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన వారే. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ దెబ్బకు వేలాది మంది ఇంటిముఖం పట్టారు. 90శాతం మంది స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో పరిశ్రమల్లో కూలీల్లేక దాదాపు నెలరోజులుగా ఉత్పత్తి, ఎగుమతులు నిలిచిపోయాయి. ఏడాదికి రూ.1200 కోట్లు, నెలకు రూ.100కోట్ల వ్యాపారం జరగాల్సి ఉండగా ప్రస్తుతం నెలకు మూడున్నర కోట్ల వ్యాపారం జరగడమే గగనమైపోయింది.
25శాతం కంటే తక్కువే ఉత్పత్తి..
ఖమ్మం జిల్లాలో 225 గ్రానైట్ క్వారీలుండగా, 435 పరిశ్రమలు, 125టైల్స్ పరిశ్రమలున్నాయి. ప్రత్యక్షంగా 50వేల మంది, పరోక్షంగా మరో 50వేల మంది కార్మికులకు ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ ముందు (2020 ఫిబ్రవరి) వరకూ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 22వేల మంది నైపుణ్యం ఉన్న కూలీలున్నారు. వారంతా రెండు దశాబ్దాలకుపైగా పనులు చేస్తూ గ్రానైట్ పరిశ్రమలో కీలక రోల్ పోషిస్తున్నారు. ఇటీవల 21వేల మంది తరలిపోయారు. ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే ఉన్నారు. దీంతో ప్రతిరోజూ 3 లక్షల చదరపు అడుగుల రాయిని సిద్ధం చేసి ఎగుమతి చేసేచోట.. నేడు రోజుకు 20వేల చదరపు అడుగుల రాయిని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో నెలకు 90 కోట్ల వ్యాపారం జరిగేది. నేడు రూ.3 కోట్లకే పరిమితం కావడం గమనార్హం.
అంతా బొటాబొటి బతుకులే..
గ్రానైట్ పరిశ్రమలు, క్వారీల్లో మెకానిక్లు, పూడిక రవాణా చేసేవారు, రాళ్లు తొలగించేవారు, టిప్పర్లు, డ్రైవర్లు, లోడింగ్ చేసే హమాలీలు, ట్రాక్టర్లతో రాళ్లు రవాణా చేసేవారు, గ్రానైట్ యంత్రాల వద్ద మార్కర్లు, పాలిషర్లు, కట్టర్లు, షినిషింగ్ సరుకు రవాణా చేసేవారు, వివిధ దేశాలకు చెందిన బయ్యర్లకు ఏజంట్లుగా పనిచేసేవారు మొత్తం లక్షమంది ఉండేవారు. వారందరికీ ఉపాధి లేకుండా పోవడంతో పోషణకు పాట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి తన భార్య సురేఖ, పిల్లలతో పదేండ్ల కిందట వలసొచ్చిన నవాజ్రెడ్డి(28) అనే యువకుడు ఉపాధి నిలిచి, అప్పు పుట్టక మార్చి 28న క్వారీలోనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అనంతరం వలసకూలీలుగా వచ్చిన వారంతా బిక్కుబిక్కుమంటూ కాలినడక కొందరు, ప్రభుత్వ వాహనాల్లో మరికొందరు సొంతూర్లకు పయనమయ్యారు.
ఆరేండ్లుగా సబ్సిడీల్లేవ్..
గ్రానైట్ పరిశ్రమ స్థాపించిన వారికి విడతల వారీగా రావాల్సిన రాయితీలు ఆరేండ్లుగా విడుదలకాక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నైరాశ్యంలో కూరుకుపోయారు. 2020 జనవరి నాటికి పెట్టుబడి రాయితీ కింద రూ.5.5కోట్లు, విద్యుత్ ఏర్పాటు చేసుకున్నందుకు రాయితీ కింద రూ.13.59 కోట్లు, పారిశ్రామికవేత్తలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించే క్రమంలో విడుదల కాని రూ.14.60కోట్లు, వాణిజ్యపన్నుల సబ్సిడీ కింద రూ. 7.40 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో సుమారు 260 పరిశ్రమలకుగాను పావలా వడ్డీ, కరెంటు బిల్లుల రాయితీ సహా మొత్తం రూ.100కోట్ల రాయితీలు రాక మరిన్ని కష్టాలెదురవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒక్కపైసా రాలేదని యజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా 550 గ్రానైట్ పరిశ్రమలకు అప్పులిచ్చిన బ్యాంకులకు మూణ్నెల్లు సుమారు రూ.750 కోట్లు మారటోరియం విధిస్తున్నామని చెప్పి, తాజాగా వాయిదాలతో సహా వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నిధులనే కేంద్రం తమ పరిశ్రమలకు ఇచ్చినట్టుగా లెక్కలు చూపిందని వాపోతున్నారు.
ఉపాధిలేకుండా పోయింది : మామిళ్ల బుచ్చిబాబు, గ్రానైట్ కార్మికుడు
గ్రానైట్ పరిశ్రమలు పనిచేసేటప్పుడు నెలకు రూ.10వేలకుపైగా జీతం వచ్చేది. నాలుగునెలలుగా పరిశ్రమలు పనిచేయక పనిలేకుండా పోయింది. అప్పుడప్పుడు కూలిపనికి వెళ్తున్నా. లేనప్పుడు ఇంటివద్దే ఉండాల్సి వస్తోంది. చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి.
రాయల్టీని మూడేండ్ల పాటు ఎత్తివేయాలి : తమ్మినేని వెంకట్రావ్, గ్రానైట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు
కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ఒరిగిందేమీలేదు. ఆరేండ్లుగా రావాల్సిన రాయితీలు అరకొరగానే విడుదల చేశారు. జీఎస్టీ 18 శాతం విధిస్తుండటంతో మరింతగా కష్టాలు పెరిగాయి. ప్రస్తుతం బ్లాక్ గ్రానైట్పై ఉన్న రాయల్టీని మూడేండ్ల పాటు పూర్తిగా ఎత్తివేయాలి. పెండింగ్లో ఉన్న సబ్సిడీలు అన్నీ విడుదల చేయాలి.