Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కూలుతున్నది సచివాలయం కాదనీ, తెలంగాణ బతుకు అనిటీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, పేర్కొన్నారు. ఈ మేరకు వారు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రులపై ఏమాత్రం నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డాక్టర్ నుంచి అధిక ఫీజుకోసం నిర్బంధించిన ఆస్పత్రిపైనా, ప్రజా గాయకుడు నిస్సార్కు చికిత్స చేసేందుకు నిరాకరించిన ఆరు ప్రయివేటు ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వీరికే ఇలాంటి పరిస్థితి ఎదురైదంటే బీదాబిక్కి ప్రజల బాధలు చెప్పలేనివని తెలిపారు. ప్రజలు కరోనా పరీక్షలు, చికిత్స కోసం నిరీక్షించే పరిస్థితి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యరంగానికి 0.8 శాతమే ఖర్చుపెట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనీ, ఇప్పటికైనా వైద్య రంగానికి నిధులను పెంచి ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజుల బకాయిలు, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల బకాయిల కంటే సచివాలయానికే ఎక్కువగా ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. వందేండ్లకుపైగా చరిత్ర ఉన్న చారిత్రక సంపద అయిన జీబ్లాక్ను, తెలంగాణ ఉద్యమం, సచివాలయం ఉద్యోగుల సాంస్కృతిక కేంద్రమైన నల్ల పోచమ్మగుడి, మజీద్లను సీఎం కేసీఆర్ కూల్చేయించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ నియంతృత్వ విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ఆత్మగౌరవంతో బతకడం మన హక్కు అనీ, దాన్ని లాక్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.