Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 35,500 అంగన్వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాలసరఫరాకు సంబంధించి మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి విధివిధానాలపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని విజయ తెలంగాణ డెయిరీ కార్పొరేట్ డెయిరీలకు ధీటుగా మార్కెటింగ్ వ్యూహాలను అమలుచేయడం ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కావల్సిన అన్నిచర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పాల సరఫరా చేయడమే కాకుండా ఐసీడీఎస్ సెంటర్లకు కావల్సిన 20లక్షల లీటర్ల పాలను సరఫరా చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విజయ డెయిరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్ధను ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తులకు విస్తత ప్రచారం కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి చేపట్టిన కార్యక్రమాలను మంత్రి సత్యవతి రాధోడ్ అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన పాలను సరఫరా చేయడానికి కావల్సిన అన్నిరకాల హంగులు, సామర్ద్యం ఉన్న విజయ డెయిరీఫెడరేషన్ను ఒక నోడల్ ఏజెన్సీగా గుర్తించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మంత్రి సత్యవతిని కోరారు.