Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్,టీజీఎస్ రౌండ్టేబుల్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా నేపథ్యంలో కేరళ లెఫ్ట్ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణలోనూ మధ్యాహ్న భోజన మెటీరియల్ను ఇండ్లకు పంపాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, గిరిజన సంఘాల రాష్ట్ర కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐఏడబ్ల్యూ యూ, కేవీపీఎస్, టీజీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వయించాయి. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కరోనా నేపథ్యంలో ఓవైపు పౌష్టికాహారం తినాలని చెబుతూనే..విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఇండ్లకు పంపకపోవడం దారుణమన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతికి చెందిన 54,348 మంది విద్యార్థులు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు 34,825 మంది, 9,10 తరగతి విద్యార్థులు 22,443 మంది ఉన్నారనీ, వారందరికీ గ్రామ పంచాయతీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని ఇండ్లకు పంపాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివేవారికీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశా రు. వలస, అసంఘటిత కార్మికులను, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, విద్యావాలంటీర్లను, ప్రయివేటు టీచర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, పాలు, గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను పరి మితి పరిధిలోకి రాని ప్రతి మనిషికి రూ.7,500 చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్ నాయక్ మాట్లాడుతూ..పేద కుటుంబాలకు చెందిన ఒక్కో మనిషికి 10 కేజీల బియ్యంతోపాటు కేరళ ప్రభుత్వం మాదిరిగా 17 నిత్యావసర సరుకులను పౌరసరఫరాల డిపో ద్వారా ఉచితంగా ఆరునెలల పాటు ఇవ్వాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు కోట రమేశ్ మాట్లాడుతూ..ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు, తదితరులు మాట్లాడారు.