Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-యశోద ఆస్పత్రి ముందు డీవైఎఫ్ఐ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చేస్తున్న దోపిడీని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. కరోనా వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల అనుమతులు రద్దు చేయాలని కోరింది. శనివారం హైదరాబాద్లోని సోమాజిగూడ వద్ద ఉన్న యశోద ఆస్పత్రి ముందు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 'ఢిల్లీ తరహాలో హైదరాబాద్లోనూ కరోనా ఆస్పత్రిని నిర్మించాలి, యశోద ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి, రూ.100 అయ్యే లాండ్రీ ఖర్చుకు రూ.1500 వసులు చేయడం సిగ్గుచేటు' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు చేరుకుని డీవైఎఫ్ఐ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు డీవైఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ విజరుకుమార్ మాట్లాడుతూ కరోనా చికిత్స పేరుతో ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా రోగులను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. యశోద, కేర్, కిమ్స్, తుంబే, సన్షైన్, ఏఐజీ, అంకుర ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్స చేసే అనుమతులను రద్దు చేయాలని కోరారు. సికింద్రాబాద్లోని యశోద, ఏఐజీ, కేర్ అధిక ఫీజుల పేరుతో రోగులను పిండుతున్నాయని అన్నారు. ఇలాంటి సామాజిక బాధ్యత లేని ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి టి మహేందర్, నాయకులు సందీప్, గణేష్, సాయి, కిరణ్, సంతోష్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.