Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏకపక్షంగా పాఠ్యాంశాలను తొలగించడం సరికాదు :
ఎస్వీకే వెబ్నార్లో ప్రొఫెసర్ల వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సెంట్రల్బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠ్యాంశాలను ఏకపక్షంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సొంత నిర్ణయాలు తగవని హెచ్చరించారు. 'పిల్లల పాఠాలపై ఎందుకీ కసి (ఫెడరలిజం, సెక్యులరిజం, జీవపరిణామం, సీఏఏ వంటి అంశాల తొలగింపు) అనే అంశంపై శనివారం ఎస్వీకేలో వెబ్నార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఉద్యమాలతోనే పుస్తకాలు:ఇనుకొండ తిరుమలి
చరిత్ర అధ్యాపకులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి మాట్లాడుతూ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాల ప్రభావంతోనే అనేక పుస్తకాలు వచ్చాయన్నారు. ఆ పుస్తకాలు విద్యార్థుల్లో సమైక్యత, సమగ్రత అనే భావాన్ని పెంపొందించాయన్నారు. జాతీయత అనే భావన దేశంలో బలంగా ఉందనీ, దీంతోనే జాతీయోద్యమం కొనసాగిందని గుర్తు చేశారు. దీని ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటుందన్నారు. దేశంలో ఫెడరలిజం, లౌకికవాదం, జాతీయవాదం వంటి అంశాలన్నీ మన దేశం, మనం భారతీయులం అనే భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఇలాంటి ప్రధానమైన పాఠ్యాంశాలు తొలగించడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రజాఉద్యమాల వల్లనే రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపర్చారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాలు, శూద్రులు, ఎస్సీలకు అనేక హక్కులు కల్పించబడ్డాయన్నారు. ఇలాంటి పాఠ్యాంశాలను తొలగించడం వల్ల విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన లేకుండాపోతుందన్నారు.
దేవుడు సృష్టించినట్టు ఆధారాల్లేవు: దేవరాజు మహారాజు
జీవ శాస్త్ర అధ్యాపకులు రిటైర్డ్ ప్రొఫెసర్ దేవరాజు మహారాజు మాట్లాడుతూ జీవ పరిణామక్రమం పాఠ్యాంశం తొలగించడం వల్ల జాతి నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా జరిగిన ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 'జీవం ఎలా మొదలైంది. జీవరాసులు ఎలా వచ్చాయి. మానవ పరిణామక్రమం ఎలా ఆవిర్భవించింది' అనే అంశాలు ప్రతి మానవుడు తెలుసుకోవాలని సూచించారు. కొన్ని లక్షల ఏండ్లుగా జరుగుతున్న మార్పుల ఫలితంగానే జీవపరిణామక్రమం ఏర్పడిందన్నారు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. డార్విన్ సిద్ధాంతం నేడు విశ్వవ్యాపితమైందనీ, దాన్ని ప్రచారం చేసేందుకు అనేక దేశాల్లో సొసైటీలు ఏర్పాడ్డాయని గుర్తు చేశారు. ఉనికి కోసం పోరాటం ఉంటుందనీ, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడితే ప్రజలు ఉద్యమిస్తారని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఒక ఉదాహరణ అన్నారు. నియంతృత్వంగా తొలగించిన పాఠ్యాంశాల పునరుద్ధరణ కోసం ఉద్యమించాలని కోరారు.
కుట్రలో భాగమే: మాడభూషి శ్రీధర్
రాజ్యాంగ అధ్యాపకులు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థను స్వతంత్రంగా లేకుండా చేసే కుట్రలో భాగంగానే పాఠ్యాంశాలను తొలగించారన్నారు. పాఠ్యాంశాల తొలగింపు అవసరమా? లేదా? అనే అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తొలగించడం అన్యాయమన్నారు. ఆన్లైన్ విద్యాబోధన కేవలం సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుందనీ, విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడదన్నారు. ఆన్లైన్లో పాఠాలు అర్థం చేసుకోవడం విద్యార్థులకు చాలా కష్టంగా ఉంటుందన్నారు. పాఠ్యాంశాలు తొలగించడం వల్ల పౌరహక్కులు, మానవహక్కులు, సామాజిక స్పృహ, ఓట్లు, ఎన్నికలు వంటి అంశాల పట్ల అవగాహన ఉండదని తెలిపారు. ఇలాంటి అంశాలు తెలుసుకోకుండా ఉండేందుకే పాఠ్యాంశాలు తొలగించారని చెప్పారు. అయితే సొంత నిర్ణయాలతో పాఠ్యాంశాలు తొలగించడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.