Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అన్నదాత ఏమూల ఉన్నా గుర్తించండి
- విత్తనాల నిల్వకోసం రూ.25 కోట్లతో మోడర్న్ కోల్డ్ స్టోరేజీ
- దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. తద్వారా చిట్ట చివరి రైతుకూ ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రైతులు ప్రస్తుత వానాకాలంలో వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తుండడం శుభసూచికమని తెలిపారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని తెలిపారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు వీలుగా రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజీని నిర్మించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతుబంధు, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎస్. నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్రెడ్డి, రామకృష్ణారావు, నర్సింగరావు, సీడ్ కార్పొరేషన్ ఎమ్డీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విజరు కుమార్, డీడీఏ శైలజ, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
'కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయాన్ని విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 99.9 శాతం మంది రైతులకు సాయమందింది. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోతే.. వెంటనే వారిని గుర్తించి సాయమందించాలి. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? లేదా..? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి. క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి నివేదికలు, రైతుబంధు సమితుల ద్వారా వివరాలు తెప్పించాలి. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలి. కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల సాయం అందడంలో ఇబ్బంది కలగొచ్చు. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించీ.. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒకసారి పరిష్కారమైపోతే ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని విధాలా మంచిది. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే నిర్వహించింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్దారించారు. మిగతా చోట్ల కూడా అదే జరగాలి...' అని సీఎం కోరారు. 'రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి వీలుగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలి. ఒకసారి రైతు వేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి...' అని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
14 రోజుల తర్వాత ప్రగతి భవన్కు కేసీఆర్..
పద్నాలుగు రోజుల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్... శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల అనంతరం ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అడపాదడపా పత్రికా ప్రకటనలు తప్ప.. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనలేదు. దీంతో కేసీఆర్ కనబడటం లేదనే వార్తలు కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో 'కేసీఆర్ ఎక్కడ..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు? ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్లో గేటు వద్దకు దూసుకుపోయి నిరసన తెలిపారు. 'సీఎం కేసీఆర్ ఎక్కడ...?' ఆయన మా సీఎం, ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు...' అని ఇంగ్లీషులో రాసున్న ఫ్లకార్డులను వారు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మెరుపు వేగంతో జరగడం వల్ల తాము వారిని పట్టుకోలేకపోయామంటూ పోలీసులు వివరణిచ్చుకున్నారు. ఆ తర్వాత సీసీ కెమేరాల ఫుటేజీల ఆధారంగా ఆ యువకులను అరెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ..? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతీ తెలిసిందే. ఇదిలావుండగా ప్రగతిభవన్ చేరుకున్న సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై సమీక్ష చేశారు.