Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆపరేషన్ రూల్స్ను సిద్ధం చేయండి...
- నీటి పారుదలశాఖను విభజిస్తాం:
సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారింది. భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయి. చెరువులు బాగుపడ్డాయి. కోటికి పైగా ఎకరాలకు సాగు నీరందించే గొప్ప వ్యవస్థ ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆపరేషన్ రూల్స్ను రూపొందించాలి. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్ పనులు, రిపేర్లు చేసుకోవాలి. జూన్ నాటికి సర్వం సిద్ధం కావాలి' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులు, కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి నీరందించే ప్రణాళికపై ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 'పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలి. అతని పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడీసీ అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా పనిచేయాలి. అధికారులకు కావాల్సిన అధికారాలను అప్పగించాలి. ప్రతీ స్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలి...' అని అన్నారు.
'ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలి. దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలి. తర్వాత రిజర్వాయర్లు నింపాలి. చివరి ఆయకట్టుకూ నీరందించాలి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటిలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగు నీరందని ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండు టీఎమ్సీల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి దాని పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించాలి. వరద, కాకతీయ కాల్వలు, అప్పర్, మిడ్, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయి. అవి
జీవధారలుగా మారతాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టీఎమ్సీల నీటిని అందుబాటులో ఉంచాలి. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలి' అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
'ఎస్సారెస్పీ పరిధిలోని వరద, కాకతీయ కాల్వల మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటిలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్సారెస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది. ఆ కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి. వరద, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ కాల్వల దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి వరద కాలువ ద్వారా ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీరందించాలి. ఈ ఏడాది కష్ణా నదిలో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా-2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్ను నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి-82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగు నీరందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి...' అని సీఎం సూచించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్.నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్లు, జైపాల్ యాదవ్, రవిశంకర్, సంజరు, కె. విద్యాసాగర్ రావు, కందాల ఉపేందర్ రెడ్డి, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.